హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల్లో రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు కల్పించినట్లు
రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మునుగోడులో 35 సున్నిత
ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. హింసాత్మక ఘటనలకు అవకాశం ఉన్న కేంద్రాలను గుర్తించామని, రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
సుమారు 2వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీసం తొమ్మిది మంది సిబ్బంది ఉంటారన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్న ఆయన.. చెక్ పోస్టులు గురువారం ఎన్నికలు ముగిసే వరకు ఉంటాయని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిని బైండోవర్ చేశామని, ఇప్పటి వరకు రూ.4కోట్ల నగదును సీజ్ చేసినట్లు వివరించారు. మరో వైపు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్కు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు.
గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. 2,41,855 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. బుధవారం అధికారులు ఎన్నికల సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. చండూరులోని డాన్ బోస్కో కళాశాలలో ఎన్నికల సామగ్రిని పంపిణీ జరిగింది. సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు.