సూర్యాపేట : నూతన వ్యవసాయ చట్టాలతో దేశంలోని రైతాంగాన్ని కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్రలు పన్నిందని ఇదే విషయాన్ని ఇతివృత్తంగా తీసుకుని రైతన్న సినిమా తీసినట్లు నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి తెలిపారు. సూర్యాపేట క్యాంప్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డితో ఆర్.నారాయణ మూర్తి గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతన్న సినిమాను వీక్షించిన మంత్రికి ఆర్.నారాయణ మూర్తి అభినందనలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంత్రి జగదీష్ రెడ్డి తమ శ్రేయోభిలాషులు అని తెలిపారు. రైతన్న సినిమాను మంత్రి వీక్షించండం గొప్ప బలాన్ని ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు శాపాలుగా పరిణమించబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ చట్టం బీహార్లో అమలు పరిచినట్లు చెప్పారు. అక్కడ రైతులు కూలీలుగా మారారన్నారు. ఇప్పుడు దేశం మొత్తం విస్తరించాలి అన్నది కేంద్రం కుట్ర అన్నారు. అదే జరిగితే యావత్ భారతదేశంలో రైతులు ఉండరు… కూలీలుగా మారతారన్నారు. విద్యుత్ సవరణ చట్టం కార్పొరేట్ వ్యవస్థకు లబ్ది చేకూర్చేందుకేనన్నారు. సవరణ అంటూ జరిగితే ఉచిత విద్యుత్కు మంగళం పాడినట్లేనన్నారు. అదే ఇతి వృత్తాంతంతో రైతన్న సినిమా తీసినట్లు ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలన్నారు.