R Narayana Murthy | పీపుల్స్స్టార్ నారాయణమూర్తి మాటంటే పీపుల్ వాయిస్.. కండలు కరిగించే కార్మికుడి కష్టం ఆయనకు తెలుసు. ఆరుగాలం శ్రమించే కర్షకుడి చెమట విలువ ఇంకా బాగా తెలుసు. నిరుపేద గుండెబరువు తెలిసిన వాడు. కాబట్టే.. ఆ పేదవాడికి అండగా నిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనసారా మెచ్చుకుంటున్నారు. రైతును రాజును చేసిన కేసీఆర్కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. శ్రామికుల వెతలనే కథలుగా వెండితెరపై ఆయన రెపరెపలాడించిన ఎర్రెర్రని జెండాలు ప్రజల అజెండాను పాలకులకు చేరువ చేశాయి. ఆయన నటించి, నిర్మించిన పోరు తెలంగాణ, వీర తెలంగాణ చిత్రాలు మలిదశ ఉద్యమానికి మరింత ఊపునిచ్చాయి. ‘పదేండ్లలో తెలంగాణ బహుముఖీన అభివృద్ధి సాధించింది’ అని ఈ ముక్కుసూటి మనిషి నిక్కచ్చిగా చెబుతున్నారు. కేసీఆర్ పాలనతో తెలంగాణకు మహర్దశ పట్టిందని ఆనందం వ్యక్తం చేస్తున్న ఆర్. నారాయణమూర్తితో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
ఎక్కడ నీరు ఉంటుందో అక్కడే నాగరికత పరిఢవిల్లుతుంది అని చారిత్రక పరిశోధనల ద్వారా తెలుస్తుంది. నీళ్లు ఉన్నప్పుడే ప్రజలు నాణ్యమైన జీవితాన్ని సాగించే పరిస్థితులు ఏర్పడతాయి. దశాబ్దం కిందటి వరకు తెలంగాణ వెనుకబడటానికి కారణం నీళ్లు లేకపోవడమే! నీళ్లు లేక.. పంటలు పండక పల్లెలు ఛిద్రమయ్యాయి. ఆత్మగౌరవం అడుగంటింది. ఆ దశలో కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ సాధన కోసం నడుం బిగించారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం ఈ మహోన్నత లక్ష్యాలు సాధించాలనే సంకల్పంతో అడుగు ముందుకు వేశారు. పుష్కర కాలం అలుపెరగని పోరాటం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. సాధించిన రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారు.
తెలంగాణ ఉద్యమం నీళ్లు.. నిధులు.. నియామకాలు..! అందుకే రాష్ట్రం సిద్ధించిన వెంటనే సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగించారు. కృష్ణా, గోదావరి నీళ్లతో తల్లి తెలంగాణ పులకిస్తున్నది. మూడున్నరేండ్లలో కాళేశ్వరం పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేశారు. ‘భూమికి పచ్చాని రంగేసినట్టు..’ అన్న పాట చందంగా నేడు రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడుతున్నది. తెలంగాణను ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’ అని శాస్త్రజ్ఞులు కొనియాడుతున్నారంటే అది కేసీఆర్ గారి ఘనతే! ఒకప్పుడు వరి ఎక్కువగా పండే ప్రదేశాలు అంటే తూర్పు గోదావరి, తమిళనాడులోని తంజావూరు, పంజాబ్లో కొన్ని ప్రాంతాల పేర్లు వినిపించేవి. కానీ, నేడు తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ ఆ మాటకొస్తే వలసల జిల్లాగా పేరున్న పాలమూరు గురించి మాట్లాడుతున్నారు. ఇంతటి ప్రగతి సాధించడం చెప్పినంత తేలిక కాదు. ఈ ఘనతకు కారణమైన కేసీఆర్ గారికి నేను సెల్యూట్ చేస్తున్నా. ఆయన చేపట్టిన జలయజ్ఞానికి భగవంతుడు కూడా తోడై నేడు తెలంగాణ దేశానికే అన్నం పెట్టే దశకు వచ్చింది.
ముమ్మాటికీ! భౌగోళికంగా దక్కన్ పీఠభూమి ప్రాంతంగా ఉన్న తెలంగాణలో వ్యవసాయం వర్షం మీదనే ఆధారపడి ఉండేది. మబ్బులను నమ్ముకొని రైతులు పంటలు వేసేవాళ్లు. సరిగ్గా వర్షాలు కురవకపోతే.. ఆ ఏడాదంతా కరువే! వేలమంది రైతులు వందల అడుగుల లోతు బోర్లు వేసినా నీళ్లు పడేవి కావు. మెదక్, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల నుంచి వేల మంది రైతులు బతుకుదెరువు కోసం వలస బాటపట్టారు. తెలంగాణ కర్షకులు ముంబయిలో కార్మికులుగా కనిపించేవారు. ఎప్పుడో పండుగల సందర్భంలో సొంత గ్రామాలకు వచ్చిపోయే దుర్భర పరిస్థితులు ఉండేవి. చేనేత కార్మికుల పరిస్థితులు మరింత అన్యాయం. సిరిసిల్ల ప్రాంతంలో వందలాది మంది నేతన్నలు ఉరి పోసుకున్న వార్తలు ఎన్నో చదివినం. భీవండీ, సూరత్ వెళ్లి బతికేవాళ్లు. నీళ్ల రాకతో రైతులు బాగుపడ్డారు. ఊళ్లు బాగుపడ్డాయి. వ్యవసాయంతోపాటు దానికి అనుబంధంగా ఉన్న అన్ని రంగాలూ మెరుగయ్యాయి.
కేసీఆర్ విజన్ ఉన్న నేత. వ్యవసాయం దండగ అన్న చోట దాన్ని పండుగలా చేశారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, కీర్తిశేషులు ఎం.ఎస్.స్వామినాథన్ వంటి గొప్ప వ్యక్తి.. ‘రైతులకు మీరు చేస్తున్న మేలు చూసి నా హృదయం పులకిస్తున్నది. మీరు నిజమైన రైతుబాంధవులు. మీరు నిండు నూరేండ్లు బతకాలి’ అంటూ కేసీఆర్గారిని ఆశీర్వదించారు. ఆ ప్రశంసను భారతరత్న అవార్డుతో సమానంగా భావించొచ్చు. రైతుబంధు ద్వారా రైతులకు ముందే పెట్టుబడి ఇవ్వడం అనేది ప్రపంచంలోనే తొలిసారి. ఈ పథకాన్ని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించింది అంటే దాని గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ గారు చూడటానికి డిక్టేటర్లా కనిపించొచ్చు. కానీ ఆయన భోళా శంకరుడు. ఆయనలో గొప్ప మానవీయ కోణం కనిపిస్తుంది. నిరంతరం ప్రజలకు ఏదో మేలు చేయాలనే తపనతో ఉంటారు.
నెవర్! ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ అంధకారం అవుతుందని అప్పటి సీఎం కిరణ్కుమార్ రెడ్డి భయపెట్టారు. కానీ నేడు అన్ని రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నది. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. మహారాష్ట్రలోని కొందరు రైతులు కూడా తాము తెలంగాణలో కలిసిపోతామని కోరుతున్నారంటే ఇక్కడి పరిస్థితులు ఎంత అద్భుతంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఏర్పడితే ఏమైపోతుందో అన్న భ్రమలన్నిటినీ రాష్ట్రం సిద్ధించిన ఏడాదిలోనే ముఖ్యమంత్రి పటాపంచలు చేశారు. పదేండ్లుగా రాష్ట్రం ప్రగతి పథంలో కొనసాగుతున్నది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగి, కేసీఆర్గారి సారథ్యంలో తెలంగాణ లక్ష్యం సాకారం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.
నేడు దేశంలోని మెట్రో నగరాలన్నింటినీ అధిగమిస్తూ హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. మనం హైదరాబాద్లో ఉన్నామా లేక అమెరికాలో ఉన్నామా అనే భావన కలుగుతున్నది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఫ్లై ఓవర్స్ను భారీగా నిర్మించారు. ఐటీ పరిశ్రమల వల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. విదేశీ సంస్థలు తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ను ఎంచుకుంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ నిలుస్తున్నది. కేటీఆర్ ఆలోచనా దృక్పథం, కార్యదీక్షల వల్లే నేడు హైదరాబాద్ ప్రభ వెలిగిపోతున్నది. అమితాబ్బచ్చన్, సన్నీ దేవల్ వంటి బాలీవుడ్ నటులు సైతం అవకాశం వస్తే తాము హైదరాబాద్లోనే స్థిరపడతామని చెబుతున్నారంటే నగర అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
మూడు దశాబ్దాల కిందట హైదరాబాద్ పేరు చెబితే మతకలహాల భయం వెంటాడేది. నిత్యం ఏదో అల్లర్లు, తరచూ కర్ఫ్యూలు. ప్రజలు అభద్రతా భావంతో ఉండేవారు. గతంలో ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత పార్టీ వాళ్ల మధ్యే ఘర్షణలు, హైకమాండ్ ఆధీనంలో రాష్ట్ర పరిపాలన ఉండటంతో రాజకీయ అనిశ్చితి కనిపించేది. శాంతిభద్రతలు కూడా గాడి తప్పేవి. ఈ రోజు పరిస్థితులన్నీ మారిపోయాయి. ఈ పదేండ్లలో చిన్న ఘర్షణ కూడా చోటు చేసుకోలేదు. ప్రజలంతా సేఫ్గా ఉన్నారు. గంగా జమునా తెహజీబ్ అన్న చందంగా నేడు ఇక్కడి ప్రజలు ఆనందంగా ఉన్నారు. సమాజంలోని ప్రతి మనిషీ శాంతి, స్వేచ్ఛ, సుస్థిరత కోరుకుంటారు. ఇవాళ హైదరాబాద్తో పాటు తెలంగాణ సమాజం మొత్తం శాంతియుతంగా జీవనం సాగిస్తున్నది. ప్రభుత్వం ఎంతో పరిశ్రమ చేయబట్టి ఇంతటి మార్పు వచ్చింది! కేసీఆర్ హిందూ ముఖ్యమంత్రి అయినా అన్ని మతాల వారిని సమదృష్టితో చూస్తూ ప్రజారంజకమైన పాలన చేస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ సుస్థిరత ఉండటం వల్లే ఈ స్థాయి అభివృద్ధి సాధ్యమవుతున్నది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కెనడాలో ఉంది. ఇప్పుడు కాళేశ్వరం ఆ రికార్డును అధిగమించింది. కెనడాలోని ప్రాజెక్ట్ను ఓ దేశం నిర్మిస్తే… కాళేశ్వరాన్ని కేంద్రంతో ఏమాత్రం సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా నిర్మించుకుంది. ఇదొక అరుదైన అచీవ్మెంట్. కేవలం మూడున్నరేండ్లలో ఈ స్థాయి ప్రాజెక్ట్ను పూర్తిచేయడం ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ నేలను తవ్వినా కొన్ని ఫీట్ల లోతునే నీళ్లు ఎగజిమ్ముతున్నాయి. పదేండ్లలో మన దగ్గర భూగర్భ జలాలు నమ్మశక్యం కాని రీతిలో గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వమే అధికారిక నివేదిక అందించింది. ఇదీ అభివృద్ధికి నిజమైన చిహ్నం.
-కళాధర్రావు జూలపల్లి