చిక్కడపల్లి, ఏప్రిల్ 26: బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీ అనంతయ్య ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జనగణనలో కులగణన చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని పునరుద్ఘాటించారు.