హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్ రూరల్: క్విక్జెట్ కార్గో ఎయిర్లైన్స్.. హైదరాబాద్ నుంచి ఫ్రైటర్ సర్వీసులను ప్రారంభించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా బోయింగ్ 737-800ఎఫ్ ఎయిర్క్రాఫ్ట్తో ఢిల్లీ, బెంగళూరుకు రోజువారీ సరకు రవాణా సేవలను అందిస్తోంది. రోజూ అర్ధరాత్రి 12:30 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్న ఈ సర్వీసు.. బెంగళూరు నుంచి ఉదయం 8:50కి తిరిగి వస్తున్నది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరులను కవర్ చేసే తమ నెట్వర్ ప్రదేశాలకు కార్గోను తీసుకెళ్తోంది.
ఈ సందర్భంగా జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా నిరాటంకమైన, వేగవంతమైన కార్గో సేవలను అందించడానికి విశ్వశ్రేణి సదుపాయాలను కల్పిస్తున్నదని తెలిపారు. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రధాన కార్గో హబ్లతోపాటు, ఫ్రాంక్ఫర్ట్, ఇస్తాంబుల్, దుబాయ్, దోహా, హాంకాంగ్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా రవాణా జరుగుతున్నదని చెప్పారు. కాగా, హైదరాబాద్ నుంచి దేశంలోని దక్షిణాది రాష్ర్టాలకు కార్గో కనెక్టివిటీని మరింతగా పెంచడానికి క్విక్జెట్ సేవలు ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుతం క్విక్జెట్ వద్ద 22 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో బి737-800ఎఫ్ రెండు విమానాలున్నాయి.