బాసర, జూలై 30: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఇంచార్జి వీసీ వెంకరమణ తెలిపారు. శనివారం సాయంత్రం ట్రిపుల్ ఐటీలోని అన్ని విభాగాల క్లాస్ రిప్రజెంటేటివ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను సీఆర్లు వీసీ దృష్టికి తెచ్చారు. వీటిపై అక్కడున్న అధికారులకు పలు సూచనలు చేసి సమస్యలను పరిష్కరించాలని ఇంచార్జి వీసీ ఆదేశించారు. యూనివర్సిటీలో క్రీడా వసతులు మెరుగుపరిచేందుకు, ఇంజినీరింగ్ విద్యలో సంస్కరణలు తేవడానికి అనుభవజ్ఞులు, ప్రొఫెసర్లతో కమిటీలను వేశామన్నారు.
వచ్చే నెల 6న 9 కంపెనీలతో అవగాహన ఒప్పందం చేసుకొంటామని వీసీ తెలిపారు. ఈ ఒప్పందాలతో విద్యార్థులకు లాభం చేకూరుతుందన్నారు. విద్యార్థుల బీమాకు సంబంధించి ఇద్దరు ప్రొఫెసర్లతో కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ నిర్ణయానికి అనుగుణంగా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. బాసర ట్రిపుల్ఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన పూర్వ విద్యార్థి దేవులపల్లి నవీన్కుమార్ రూ. 47 లక్షల వార్షిక వేతనంతో ఎన్వీఐడీఐఏ కంపెనీలో ఉద్యోగం రాగా, ఆయన్ను సన్మానించారు.