హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): తాజా మాజీ ఎమ్మెల్యేలు తక్షణం తమ క్వార్టర్లను ఖాళీ చేయాల్సిందిగా రాష్ట్ర శాసనసభా కార్యదర్శి శుక్రవారం మళ్లీ నోటీసులు పంపారు. డిసెంబర్ 3 న ఎన్నికల ఫలితాలు వచ్చాయని, కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి క్వార్టర్లను కేటాయించాల్సి ఉంటుందని కార్యదర్శి ఆ నోటీసులో పేర్కొన్నారు. డిసెంబర్ 15న తొలి నోటీసు ఇచ్చిన ఆయన ఆ తర్వాత వరుసగా రిమైండర్ నోటీసులు పంపారు. తాజాగా గత నెల 31న చివరి నోటీసు అందించారు. ఫిబ్రవరి 5లోగా క్వార్టర్లను ఖాళీ చేయాలని పేర్కొన్నారు.
ఒకవేళ క్వార్టర్లను ఖాళీ చేయకపోతే నీరు, విద్యుత్తు సదుపాయం నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఉంటున్న వారు ఖాళీ చేస్తే క్వార్టర్లకు మరమ్మతులు చేసి, వాటిని కొత్త వారికి కేటాయిస్తామని అంటున్నారు. ఈనెల 5 తేదీని గడవుగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఉన్నపళంగా క్వార్టర్లు ఖాళీ చేయమంటే ఎట్లా అని మాజీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల్లోనే నాలుగు నోటీసులు ఇచ్చారని, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయడం ఇబ్బంది అని, గతంలో మాజీ ఎమ్మెల్యేలకు కూడా క్వార్టర్లు ఇచ్చేవారని, తమకు కూడా క్వార్టర్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు వారు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబును కూడా కలిశారు. తాము కిరాయి ఇండ్లను వెతుక్కునే వరకు ఇక్కడ ఉండేందుకు గడవు ఇవ్వాలని వారు కోరుతున్నారు.