హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): చోరీ కేసులో అనుమానితుడు ఖదీర్ఖాన్ మృతికి మెదక్ పోలీసుల చిత్రహింసలు కారణం కాదని హైకోర్టుకు రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్రావు నివేదించారు. ఖదీర్ఖాన్ను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చిన 14 రోజులకు మరణించారని నివేదికలో పేర్కొన్నారు. పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని ఖదీర్ఖాన్ భార్య చెప్తున్నారని, అందుకే దీనిపై విచారణ జరుపుతున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది.
చిత్రహింసల వల్లే ఖదీర్ఖాన్ మరణించారంటూ పత్రికల్లో వచ్చిన కథనాన్ని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు మంగళవారం విచారించింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మెదక్ ఎస్పీ, డీఎస్పీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను మార్చి 14కి వాయిదా వేసింది.
రూ.50 లక్షలు పరిహారం ఇప్పించాలి
పోలీసుల వల్లే తన భర్త ఖదీర్ఖాన్ మరణించారని, రూ.50 లక్షలు పరిహారం ఇప్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఆయన భార్య సిద్ధేశ్వరి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారిస్తున్నదని ప్రభుత్వ న్యాయవాది జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ పిటిషన్ను సీజే నేతృత్వంలోని ధర్మాసనానికి నివేదించాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్రెడ్డి ఆదేశించారు.