హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): వంద కోట్లకుపైగా జనాభా ఉన్న దేశానికి ప్రధానిగా నేతృత్వం వహించిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని విదేశాల్లో మొదటిసారిగా ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉన్నదని పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, ఓవర్సీస్ కమిటీ కన్వీనర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. శనివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ స్ట్రాత్ఫీల్డ్ హోంబుష్ కమ్యూనిటీ సెంటర్లో పీవీ నరసింహారావు విగ్రహాన్ని స్థానిక మేయర్ మాథ్యూ బ్లాక్మోర్, కౌన్సిలర్ సంధ్యారెడ్డి, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానిక ఇండియన్, తెలుగు, తెలంగాణ సంఘాల ప్రతినిధుల సమక్షంలో ఆవిష్కరించారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి, భారత, ఆస్ట్రేలియా జాతీయ గీతాలాపనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాగతోపన్యాసం చేసిన మహేశ్ బిగాల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు విదేశాల్లో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉన్నదని చెప్పారు. ఎంపీ కే కేశవరావు ఆధ్యక్షతన పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేయడం, అందులో తనకు ప్రాతినిధ్యం కల్పించి.. విదేశాల్లో ఉత్సవాలు జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 50 దేశాల్లో పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించామని వివరించారు. పీవీ విగ్రహాలు మరో 5 ఇతర దేశాల్లో ఆవిష్కరించేలా ప్రణాళిక రూపొందించినట్టు వెల్లడించారు.
సౌభ్రాతృత్వమున్న దేశం మాది: మేయర్ బ్లాక్మోర్
స్ట్రాత్ఫీల్డ్ మేయర్ మాథ్యూ బ్లాక్మోర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా అన్ని దేశాల ప్రజలను కలుపుకొనిపోయే సౌభ్రాతృత్వమున్న దేశమని చెప్పారు. ఇలాంటి దేశంలో భారత మాజీ ప్రధాని పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమని, ఇది గొప్ప కార్యమని కొనియాడారు. ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ.. తండ్రితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకొన్నారు. పీవీని పదవులు ఎలా వరించాయి.. రాజకీయాలు, పరిపాలనలో పీవీ ముద్రను వివరించారు. ప్రధానిగా పీవీ చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన విప్లవాత్మక పథకాలను వెల్లడించారు.
పీవీ శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఘనంగా నిర్వహించడానికి తీసుకున్న చొరవను, ఎంపీ కే కేశవరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీని కొనియాడారు. స్ట్రాత్ఫీల్డ్ కౌన్సిలర్ సంధ్యారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి కౌన్సిల్కు ఎన్నికైన మొదటి వ్యక్తినని.. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం గర్వంగా ఉన్నదన్నారు. కార్యక్రమంలో హార్న్బై కౌన్సిలర్లు రాజ్దత్తా, శ్రీని పిల్లమర్రి, లివింగ్స్టర్ చెట్టిపల్లి, పీవీ బంధువు డాక్టర్ హేమచంద్ర, ఇతర కుటుంబసభ్యులు, డాక్టర్ భారతిరెడ్డి, హర్మోహన్ వాలియా, పీవీఎన్ఆర్ లోకల్ కోర్ కమిటీసభ్యులు కేరీరెడ్డి, అరవింద్, రాజేశ్ రాపోలు, కిశో, వెంకటరమణ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
విదేశాల్లో మొదటి ప్రధాని విగ్రహం
విదేశాల్లో ఆవిష్కరించుకొన్న భారతీయుల విగ్రహాల విషయానికి వస్తే.. మహాత్మాగాంధీ తరువాత రెండో భారతీయుడి విగ్రహం పీవీదే. భారత ప్రధానుల విషయానికి వస్తే.. విదేశాల్లో ఆవిష్కరించిన ప్రధాని విగ్రహం ఆయనదే మొదటిది కావడం గమనార్హం. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు విగ్రహాలను తయారుచేసే తెలుగు కళాకారుడైన ప్రసాద్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు. దీనిని మొట్టమొదట ఆస్ట్రేలియాలో ఆవిష్కరించాలని తలిచిన ఉత్సవాల ఓవర్సీస్ కన్వీనర్ మహేశ్ బిగాల స్ట్రాత్ఫీల్డ్ కౌన్సిలర్ సంధ్యారెడ్డిని సంప్రదించగా, ఆమె అక్కడి ప్రభుత్వంతో మాట్లాడారు. విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలం ఎంపికలోనూ చొరవ చూపారు. మేయర్ మాథ్యూ బ్లాక్మోర్తో మే 22న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్ట్రాత్ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ -2020కి ఎంపికైన సంధ్యారెడ్డి కౌన్సిల్లోనూ ఈ తీర్మానానికి అంగీకారం తెలిపేలా చూశారు.