హైదరాబాద్: పీవీ నరసింహారావు (PV Narasimha rao) ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల అభివృద్ధి ఫలాలు మనం అనుభవిస్తున్నామని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవి (MLC Vani Devi) అన్నారు. పీవీ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో ఉన్న శాసన మండలిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, పీవీ కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ.. దేశంలో అనేక సంస్కరణలు తెచ్చిన గొప్ప నేత పీవీ నరసింహారావు అన్నారు. ఆయన ఆలోచనా విధానంతో దేశానికి మార్గం చూపారని చెప్పారు. పీవీకి కాంగ్రెస్ పార్టీ తగిన గౌరవం ఇవ్వలేదని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. సీఎం కేసీఆర్ పీవీ సేవలను గౌరవించారని చెప్పారు.