బేగంపేట్ మే 21: కొన్ని నెలలుగా వృషణాల నొప్పితో బాధపడుతున్న రోగికి ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా దీర్ఘకాలిక ఉపశమనం కల్పించారు సికింద్రాబాద్ కిమ్స్ దవాఖాన వైద్యులు. అత్యాధునిక క్రయోఆబ్లేషన్ టెక్నాలజీతో కేవలం ఒక సన్నని సూదితొనే నొప్పిని పూర్తిగా తగ్గించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజీషియన్ డాక్టర్ అనూష కరుమూరి వివరించారు. హైదారాబాద్కు చెందిన 51 ఏండ్ల వ్యక్తి గత 8 నెలలుగా తీవ్రమైన స్క్రోటల్ పెయిన్తో బాధపడుతున్నారు. వివిధ దవాఖానల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
చివరికి కిమ్స్ దవాఖానలో డాక్టర్ అనూష కరుమూరిని సంప్రదించగా ఆయన నేతృత్వంలో ముందుగా అల్ట్రాసౌండ్ గైడెన్స్తో నొప్పి ఉన్న కచ్చితమైన భాగాన్ని గుర్తించారు. క్రయోఆబ్లేషన్ విధానంలో సన్నని సూదిని నొప్పి ఉన్న ప్రదేశంలో ప్రవేశపెట్టి అందులో నుంచి అతిచల్లని గ్యాస్ను పంపించారు. దీంతో ఆ ప్రాంతంలో చిన్న మంచుగడ్డ ఏర్పడి నొప్పిని కలిగించే కణాలను నలిపివేస్తుంది. ఈ ప్రక్రియ వలన నొప్పి తక్షణమే తగ్గిపోతుంది. శస్త్రచికత్స లేకుండా చేసే ఈ ప్రక్రియ ద్వారా రోగికి దీర్ఘకాలిక ఉపశమనం లభిస్తుందని వైద్యులు తెలిపారు. తెలుగు రాష్ర్టాల్లో తొలిసారిగా ఈ నొప్పికి చికిత్స కిమ్స్ దవాఖానలోనే అందించినట్టు తెలిపారు. ఈ విధానంలో శరీరంలోని ఏ ఇతర భాగంలోనైనా దీర్ఘకాలిక నొప్పులకు ఉపశమనం పొందవచ్చని తెలిపారు.