ఈటలపై పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఫైర్
రామగిరి, జూన్ 6: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన పదవి పోయిందన్న బాధలో నుంచి ఇంకా తేరుకోలేదని, అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఆదివారం భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యసభసభ్యుడు సంతోష్, ఎమ్మెల్సీ కవితపై ఈటల రాజేందర్ అనవసర వ్యాఖ్యలు చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం సాధించుకున్నాక ఏ ఒక్కరోజు కూడా ఎమ్మెల్సీ కవిత ఒక ముఖ్యమంత్రి కూతురిగా కాకుండా, సామాన్య పార్టీ కార్యకర్తగానే పని చేశారన్నారు. రాష్ట్ర ఆవిర్భావం కోసం కవిత ఏ విధంగా పనిచేశారో.. మంథని నియోజకవర్గంలో చీకటి పాలనను అలాగే అంతమొందించారని గుర్తుచేశారు. ఈటల చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.