హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల చూపు BRS పార్టీ వైపే ఉందని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద పద్మారావు నగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీ అనుగు పుశ్వంత్ రెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister talasani) సమక్షంలో BRS పార్టీలో చేరారు. మంత్రి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారంలో ఉన్నంత కాలం అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని, మళ్లీ ఇప్పుడు మరొక్క చాన్స్ అంటూ వస్తున్నారని విమర్శించారు. జనం మోసకారి కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదని చెప్పారు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న KCR నాయకత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని తెలిపారు.
తిరిగి BRS అధికారంలోకి రావడం, హ్యాట్రిక్ సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మారావు నగర్ BRS పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, జనరల్ సెక్రెటరీ మహేందర్, నాయకులు ఏసూరి మహేష్, మినుముల సురేష్ తదితరులు ఉన్నారు.