హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఏపీలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పుష్పయాగం శోభాయమానంగా జరిగింది. కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం ఈ పుష్పయాగం నిర్వహించారు. వైదికుల చతుర్వేద పారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి వంటి 12 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరురకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. అమ్మవారి నిత్యకైంకర్యాల్లో, బ్రహ్మోత్సవాల్లో లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, గార్డెన్ డీడీ శ్రీనివాసులు, ఏఈవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.