పెద్దకొత్తపల్లి/నాగర్కర్నూల్ : ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో, కోడేర్ మండలం నాగులపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఓ వైపు కరోనాపై పోరాడుతూనే మరో వైపు రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. దళారుల బెడద అరికట్టేందుకు కొనుగోలు కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని బీరం హెచ్చరించారు.
ప్రజలు కూడా సహకరించాలని, పంట కోసి బాగా ఆరబెట్టిన తర్వాత వారికి ఇచ్చిన టోకెన్ నెంబర్ ప్రకారంగా కొనుగోలు కేంద్రాలకు రావాలని రైతులను కోరారు. కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న కారణంగా రైతులందరూ మాస్క్ లు ధరించాలని, తప్పకుండా భౌతిక దూరం పాటించాలని సూచించారు.