హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు చురుకుగా సాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటి వరకు 90 వేల మంది రైతుల నుంచి రూ.10,500 కోట్ల విలువైన 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు శుక్రవారం ప్రకటించారు. ధాన్యం కొనుగోలుకు నిధుల సమస్య లేదని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కొనుగోలు పూర్తి కాగానే వీలైనంత త్వరగా రైతులకు నగదు జమ చేస్తున్నామని, ఇప్పటి వరకు రైతులకు రూ.8,576 కోట్లు చెల్లించామని వివరించారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, రైతులకు అవసరమైన గన్నీ సంచులు, టార్పాలిన్లు, వాహనాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉండడంతో ధాన్యం కొనుగోలుకు ప్రైవేటు వ్యాపారులు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు.