గజ్వేల్, ఫిబ్రవరి 14: తెలంగాణలో నీటి వనరులను సృష్టించడంతోపాటు ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు అద్భుతమని పంజాబ్ రాష్ట్ర అధికారులు ప్రశంసించారు. ఈనెల 16న పంజాబ్ సీఎం భగవత్సింగ్ మాన్ మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లతోపాటు గజ్వేల్లోని పాండవుల చెరువు, నర్సన్నపేట చెక్డ్యామ్లను సందర్శించనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో.. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్లోని కొండపోచమ్మ రిజర్వాయర్, గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువు మినీ ట్యాంక్బండ్ను పంజాబ్ రాష్ట్ర నీటిపారుదల, వ్యవసాయశాఖ అధికారుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఎస్ఈ వేణు, ఈఈ బాలాజీ, డీఈ మోతియా కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణం, భూసేకరణ, నీటి పంపింగ్, సామర్థ్యం తదితర అంశాలను పంజాబ్ అధికారులకు వివరించారు.
అనంతరం గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువు మినీ ట్యాంక్బండ్ను సందర్శించిన అధికారులకు.. పాండవుల చెరువు గతంలో ఎలా ఉన్నది? ప్రస్తుతం చేసిన అభివృద్ధి గురించి ఇరిగేషన్ అధికారులు వివరించారు. భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదా? అని పంజాబ్ అధికారులు ప్రశ్నించగా.. పూర్వం నుంచే చెరువులు, కుంటల విస్తీర్ణం భారీగా ఉండేదని, దాని ప్రకారంగానే వాటిని అభివృద్ధి చేశామని చెప్పారు. ఇంత ఎండల్లోనూ చెరువులు, కుంటల్లో నీళ్లు ఎలా నిల్వ ఉన్నాయని అడిగితే.. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి.. కొండపోచమ్మ రిజర్వాయర్ కాల్వల ద్వారా అన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో నింపుతున్నామని ఇరిగేషన్ ఎస్ఈ వేణు వివరించారు.