హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా మక్లూర్ సాక్షి రిపోర్టర్ పోశెట్టికి అన్ని విధాలా అండగా ఉంటానని పీయూసీ చైర్మన్, ఆ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి తన ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతూ.. పోశెట్టిపై దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరానన్నారు. ఈ దాడితో సంబంధమున్నవారిపై ఎస్సీ, ఎస్టీ కేసు, హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్న జర్నలిస్టు సంఘాల డిమాండ్కు మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. దీనిపై పోలీస్ కమిషనర్తో మాట్లాడి పోశెట్టికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో నిందితుల నుంచి పోశెట్టికి ఎలాంటి ప్రమాదం ఉండదని, ఆయనను సొంత తమ్ముడిలా చూసుకుంటానని తెలిపారు. పోశెట్టి కుటుంబానికి ప్రత్యక్షంగా భరోసా ఇవ్వడానికి వారి ఇంటికి వెళ్తానని, ఈ విషయంలో జర్నలిస్టు సంఘాలు తనను అపార్థం చేసుకోవద్దని జీవన్రెడ్డి కోరారు.