Pranahita-Chevella | హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు నివ్వెరపరుస్తున్నయ్. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి 2014 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అయినప్పటికీ ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయిన కాంగ్రెస్ ఇప్పుడు తీరిగ్గా కేసీఆర్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శుక్రవారం మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టును కేసీఆర్ పూర్తిచేసి ఉండాల్సిందని చెప్పడంపై పలువురు మండిపడుతున్నారు.
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు ఉమ్మడి ఏపీతోపాటు మహారాష్ట్రలోనూ, కేంద్రంలోనూ ఉన్నవి కాంగ్రెస్ ప్రభుత్వాలే. అయినప్పటికీ 2014 వరకు ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలను అప్పటి మహారాష్ట్ర సర్కారు తిరస్కరించినప్పటికీ అప్పటి కేబినెట్లో ఉన్న ఉత్తమ్ పల్లెత్తు మాట అనలేకపోయారు. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా సమన్వయం చేసుకోలేకపోయారు. ఇప్పుడేమో మంత్రి హోదాలో ఆ ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించి ఉండాల్సిందంటూ కూనిరాగాలు తీయడంపై ప్రజలు మండిపడుతున్నారు.