హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ తాను చాయ్వాలానని చెప్పుకొంటారు. ఆకలి బాధలు తెలిసిన చాయ్వాలా ప్రధాని అయితే ఏం జరగాలి? సామాన్యులకు ఎటువంటి ఫలితాలు దక్కాలి? ఈ తొమ్మిదేండ్లలో ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సామాన్యుల ఆగ్రహమే జవాబు. ‘కడుపు నిండా తినడానికి కూడా భయపడే రోజులు తెచ్చారు. పస్తులుండటం నేర్పించారు. వంటింటి సరుకుల ధరలు భగ్గుమనిపించేలా చేశారు. గతంలో నెలవారీ సరుకులు ఒకేసారి తెచ్చుకుంటే ఇప్పుడు వారానికోసారి అతి కష్టంగా తెచ్చుకుంటున్నాం.. జేబులో వెయ్యి రూపాయలు వేసుకుని వెళ్తే అరకొర సరకులే వస్తున్నాయి. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2014లో లీటర్ వంటనూనె ధర బ్రాండ్ను బట్టి రూ.83 నుంచి రూ.120 లోపు ఉండేది. ఇప్పుడు రూ.200 దాటింది. పల్లీనూనె రూ.200, సన్ఫ్లవర్ ఆయిల్ రూ.159-167, డబుల్ ఫిల్టర్ ఆయిల్ రూ.200, ఆలివ్ ఆయిల్ రూ.265, నువ్వులనూనె రూ.477కు చేరాయి. గతంలో నెలకు సరిపడా వంటనూనెలు ఒకేసారి తెచ్చుకునేవారమని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నది సామాన్యుల ఆవేదన.
‘నేను బీటెక్ పూర్తి చేశా. కోచింగ్, జాబ్ ట్రయల్స్ కోసం స్నేహితులతో కలిసి హిమాయత్నగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నా. కోచింగ్ తీసుకుంటూనే చిన్నాచితకా పార్ట్టైం జాబ్స్ చేస్తున్నా. ఇంటి అద్దె రూ.7 వేలు. నిత్యావసరాల ఖర్చు రూ.6 వేల పైనే అవుతున్నది. పార్ట్టైం సంపాదన చాలడం లేదు. ఇంటి నుంచి డబ్బులు పంపిస్తే గానీ గడవడం లేదు. సినిమాలు, రెస్టారెంట్లకు వెళ్లడం తగ్గించాం’ అంటూ తన బాధలు ఏకరువు పెట్టాడు సంతోష్.
రోజులో కనీసం రెండు సాైర్లెనా టీ తాగుతుంటారు. అంతకుమించి తాగే వారూ ఉన్నారు. కానీ ఇప్పుడు టీ తాగాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. టీ పొడి, పంచదార, పాల ధరలు పెరగడమే ఇందుకు కారణం. జెమిని టీ పౌడర్ 250 గ్రాములు రూ.135, టాటా టీ చక్ర 500 గ్రాములు రూ.380, త్రీరోజెస్ 500 గ్రాములు రూ.390, తాజ్ 500 గ్రాములు రూ.425, రెడ్లేబుల్ 500 గ్రాములు రూ.285 ఉన్నాయి. చక్కెర కేజీకి 42 పైనే. అర లీటర్ పాలకు కనీసం రూ.28 పెట్టాల్సిందే. ఇలా ధరలు పెరగడంతో ఉదయం మాత్రమే టీ తాగుతున్నామని, సాయంత్రం మానేశామని నాగలక్ష్మి అనే గృహిణి వివరించారు. చుట్టాలు, స్నేహితులు వచ్చినా టీ ఇవ్వలేకపోతున్నామని, మంచినీళ్లు ఇచ్చి ఊరుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు.
చిన్నారులకు పోషణను అందించే ఉత్పత్తుల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. 500 గ్రాము ల మదర్ ప్లస్ రూ.595, బోర్న్విటా రూ.295, జూనియర్ హార్లిక్స్ రూ.330, బూస్ట్ రూ.295, డాబర్ హనీ కేజీ రూ.430, పతంజలి హనీ కేజీ రూ.460 ఇలా ఏది చూసినా ధరలు మండిపోతున్నాయి. చిన్నారుల తలకు రాసే హెయిర్ ఆయిల్ 400 ఎంఎల్కు రూ.300, హిమాలయ పౌడర్కు రూ. 250 పెట్టాల్సి వస్తున్నది. ఈ ధరలు మరింత పెరగనున్నాయనేది ఆర్థిక విశ్లేషకుల హెచ్చరిక.
‘నా భర్త ప్రయివేట్ ఉద్యోగి. నెల జీతం రూ.14 వేలు. నేను ట్యూషన్స్ చెప్తే మరో రూ.4 వేలు వస్తున్నది. మొత్తం మా నెల సంపాదన 18 వేలు. నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు ఇంటర్, మరొకరు 9వ తరగతి చదువుతున్నారు. వంటింటి సరుకుల కోసం నెలకు రూ.6,552 ఖర్చు అవుతున్నది. ఇంటి అద్దె 4,500. స్కూల్ ట్రాన్స్పోర్టు, అనారోగ్యం, ఇతర ఖర్చులు నెలకు మరో రూ.3 వేలు. నెలలో ఒక్కసారైనా మటన్ తింటే అదో వెయ్యి. మొత్తంగా మా కుటుంబానికి నెలకు రూ.15,052 ఖర్చు వస్తున్నది. చుట్టాలు, పిల్లల పాకెట్ మనీ వంటివి కలుపుకుంటే మరో 3,000 ఖర్చవుతున్నది. నెలాఖరులో చేబదులు తీసుకోవాల్సి వస్తున్నది. గతంలో నిత్యావసర సరుకుల బిల్లు రూ.4 వేల లోపే ఉండేది. బీజేపీ ప్రభుత్వంలో ఈ ఖర్చు బాగా పెరిగింది. పొదుపు చేయడం సాధ్యం కావడం లేదు’ అని ఆవేదనగా చెప్పారు మాణికేశ్వర్నగర్ కాలనీకి చెందిన ప్రసన్న.
2014 నుంచి ఇప్పటిదాకా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీజిల్పై 512 శాతం, పెట్రోల్పై 194 శాతం చొప్పున ఎక్సైజ్ పన్నులను పెంచింది. దీంతో ఉత్పాదక ఖర్చులు, రవాణా చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి ఆ ప్రభావం అన్ని సరుకులపై పడిందనేది ఆర్థిక రంగ నిపుణుల విశ్లేషణ. కేంద్ర ప్రభుత్వం పాల నుంచి అంత్యక్రియల వరకు అన్ని రకాల వస్తువులు, సేవల మీద జీఎస్టీని పెంచింది. దీంతో సామాన్యుల బతుకులు మరింత భారమయ్యాయి.
మోదీ ప్రధాని అయిన తరువాత సామాన్యులకు వినోదం దూరమైంది. గతంలో రూ.150 చెల్లిస్తే 150కి పైగా టీవీ చానెల్స్ వచ్చేవని.. ఇప్పుడు సంస్కరణల పేరుతో రూ.400 చెల్లించినా 100 చానెల్స్ రావడం లేదన్నది టీవీ వీక్షకుల ఆవేదన. సినిమా టికెట్ల ధరలూ పెరగడంతో థియేటర్కు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి.
గత రెండేండ్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లు పెంచడంతో రుణగ్రహీతలపై ఈఎంఐల భారం పెరిగింది. ఉదాహరణకు 20 ఏండ్ల కాలానికి రూ.50 లక్షల లోన్ తీసుకున్నవారు గతంలో ఉన్న 7.4 శాతం వడ్డీ రేటుతో 240 నెలలపాటు ఈఎంఐ కడితే సరిపోయేదని, ప్రస్తుతం 8.9 శాతం వడ్డీ లెక్కన 424 నెలలు కట్టాల్సి వస్తున్నదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఒకప్పుడు రూ.4 వేలతో నలుగురికి సరిపడా కిరాణా సరుకులు వచ్చేవి. ఇప్పుడు రూ.6 వేలపైనే ఖర్చవుతున్నది. ఒకప్పుడు పెట్రోల్ ఖర్చు నెలకు రూ.1,800 ఉంటే ఇప్పుడు రూ.2,800-3,000 వరకు చేరింది. కరోనా తర్వాత సంపాదన మొత్తం ఇంటి ఖర్చులకే సరిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి.
-నాగవెల్లి విజయ్, విద్యానగర్, హైదరాబాద్
‘ఐదేండ్లుగా ఓ ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నా. గతంలో నెలవారీ ఖర్చులు పోను ప్రతి నెలా రూ.3,500-4,000 వరకు పొదుపు చేసేవాళ్లం. పెరిగిన నిత్యావసరాల ధరలతో పొదుపు చేయడం తగ్గింది. సంపాదన పెరగలేదు కానీ ఖర్చుల భారం ఎక్కువైంది. నెలవారీగా చెల్లించే చిట్టీ డబ్బులను కూడా అడ్జెస్ట్ చేసుకోవాల్సి వస్తున్నది’ అని ఆవేదన వ్యక్తంచేశారు హైదరాబాద్కు చెందిన సౌమ్య.
సరుకుల ధరలు పెరగడంతో గిరాకీ కూడా తగ్గుతున్నది. రెండు కొనేచోట ఒక్కటితో సరిపెట్టుకుంటున్నారు. కొనుగోలు సామర్థ్యం తగ్గడం చిరువ్యాపారులకు సమస్యగా మారింది. ధరలు పెరగడంతో ఆయా సరుకులపై వర్తకులకు మార్జిన్లు కూడా తగ్గాయి. కరోనా కంటే ముందు ఒక్కో కస్టమర్ పాలు, గుడ్లు, పెరుగు, బిస్కెట్ల కోసం కనీసం రూ.70-80 వరకు ఖర్చు చేసేవారు. ఇప్పుడు అది రూ.50-60కే పరిమితమైంది.
-చంద్రశేఖర్, మిల్క్ బూత్ నిర్వాహకుడు
పెరిగిన నిత్యావసరాల ధరలతో పస్తులుండాల్సిన దుస్థితి వస్తున్నది. సామాన్యుల గురించి ఆలోచించని ప్రభుత్వం ఎందుకు? సరుకులు కొనాలంటే ఏడుపు వస్తున్నది. గతంలో నిత్యావసర వస్తువులను నెలకు సరిపడా ఒకేసారి కొని తెచ్చుకునేటోళ్లం. ఇప్పుడు ఒకేసారి కొనలేక పోతున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం.
-స్వప్న, హైదరాబాద్
కేంద్ర విధానాలతో పేద, మధ్య త రగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. రోజు కూ లీ డబ్బులు కుటుంబపోషణకు సరిపోక అప్పుల పాలవుతున్నాం. చాయ్వాలా అని చెప్పుకునే ప్రధాని మోదీ నిత్యావసర సరుకుల ధరలు పెంచడమే పనిగా పెట్టుకున్నారు.
-రాజా, హైదరాబాద్