300 శాతం పెరిగిన ఆన్లైన్ విచారణలు
యువతలోనూ ఆసక్తి.. తాజా నివేదికలో వెల్లడి
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): మారిన జీవనశైలితో చిన్న వయస్కులు కూడా గుండె పోటుకు గురై మృతి చెందుతున్నారు. ఎంతో మంది హృద్రోగ సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరిలో గుండె ఆరోగ్య రక్షణపై శ్రద్ధ పెరుగుతున్నదట. ఇండియన్ హార్ట్ అసోసియేషన్, ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ కంపెనీ ప్రాక్టో నివేదిక ఇదే విషయాన్ని వెల్లడించింది. 50 ఏండ్ల లోపు పురుషుల్లో 50 శాతం మంది, 40 ఏండ్లలోపు వారిలో 25 శాతం మంది గుండె పోటుకు గురవుతున్నారని రిపోర్టు తెలిపింది. గత ఏడాదితో పోల్చితే పురుషుల్లో కార్డియాలజీకి సంబంధించిన ఆన్లైన్ సంప్రదింపులు 300 శాతం పెరిగాయని వెల్లడించింది. అందులో 21-40 ఏండ్ల వయస్కులేనని, మెట్రో నగరాలకు చెందిన వారు 60 శాతం మంది, ఇతర నగరాలు, పట్టణాలకు చెందిన 40 శాతం మంది ఉన్నారని వివరించింది.
అటు.. దవాఖానల్లో కార్డియాలజిస్టుల నియామకాలు 150 శాతం పెరిగాయని పేర్కొన్నది. గుండె పోటు లక్షణాలేమిటి? హృద్రోగుల్లో కరోనా ప్రభావం ఎంత? ఇతర హృద్రోగాలపై చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారని నివేదిక తెలిపింది. కాగా, భారత్లో ప్రపంచంలోనే అత్యధిక గుండె జబ్బు రోగులు ఉన్నారని, రెండేండ్లలో పురుషులు మరింత పెరిగారని ప్రాక్టో హెల్త్ కంపెనీ చీఫ్ హెల్త్ స్ట్రాటజీ ఆఫీసర్ డాక్టర్ అలెగ్జాండర్ కురువిల్లా, ఇండియన్ హార్ట్ అసోసియేషన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పట్నాయక్ తెలిపారు. ధూమపానం, మధుమేహం, రక్త పోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, జన్యుపరమైన కారణాలు ఈ సమస్యకు కారణమని వెల్లడించారు. హృద్రోగాల నుంచి తప్పించుకోవటానికి వ్యాయామం చేయాలని, ఆహార నియమాలను పాటించాలని సూచించారు.