KCR Public Meeting | ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుంది. ఒక దండి యాత్ర భారత స్వాతంత్య్ర పోరాటానికి నాంది పలికింది. ఒక మహాసభ లక్షల మందిని ఏకం చేసింది. కోట్ల మందిని ఆశయ సాధనలో నడిపించింది. తెలంగాణ కలను సాకారం చేసింది. నాడు కేసీఆర్ నాయకత్వంలో ప్రజలను సైనికుల్లా ఉద్యమ దిశగా నడిపిన ఆ సభలే.. నేడు సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని మన కండ్ల ముందుంచే వేదికలయ్యాయి. లక్షల మందిని ఆకర్షించి సభలను సక్సెస్ చేయడం ఒక ఆర్ట్ అయితే.. అందులో మన ఉద్యమ నేతను మించిన ఆర్టిస్ట్ ఎవరుంటారు. ఆ ఆర్ట్లో పేటెంట్ కనుక ఇవ్వాల్సి వస్తే.. అది కేసీఆర్కు తప్ప ఇంకెవరికి ఇస్తారు.
బహిరంగ సభలను బహుముఖ అస్త్రంగా మలచటంలో దేశంలో బీఆర్ఎస్ పార్టీదే పేటెంట్ అని చెప్పాలి. నాడు ఉద్యమ ఆకాంక్షలు, నేడు ప్రభుత్వ ప్రగతి నివేదనను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లటానికి ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎంచుకున్న బలమైన సాధనం బహిరంగ సభ. ప్రతి ఒక్కరి మనసులో తెలంగాణ వాదాన్ని ఎక్కించటంలో, తొమ్మిదిన్న రేండ్ల పాలనను ప్రజల కండ్ల ముందుంచడంలోనూ బహిరంగ సభలనే ఆయన అస్ర్తాలుగా మలుచుకున్నారు. నాడు తెలంగాణ సాధన కోసం.. నేడు తెలంగాణ నిర్మాణం కోసం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినన్ని బహిరంగ సభలు మరే రాజకీయ పార్టీ నిర్వహించలేదంటే అతిశయోక్తి కాదు. చరిత్ర గతిని, తెలంగాణ పురోగతిని కేసీఆర్ సభల ద్వారానే చాటిచెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏప్రిల్ 27, 2001న కరీంనగర్లో జరిగిన బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ సభ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందింది. కొద్ది రోజులకే హన్మకొండ జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించిన సభ ఉద్యమాన్ని మలుపు తిప్పింది. ఆ సభ జరిగిన రోజే (జూన్ 21, 2001) అప్పటి ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. స్థానిక సమరంలోకి అడుగు పెట్టబోతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. ఊరూరా తెలంగాణ ఆకాంక్షను చాటిచెప్పింది. ఈ ఎన్నికల్లో 3,000 స ర్పంచ్లు, మున్సిపాలిటీల్లో 1,200 వార్డులు, 1,000 ఎంపీటీసీలు, 85 జడ్పీటీసీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. నిజామాబాద్, కరీంనగర్ జడ్పీలపై గులాబీ జెండా ఎగురవేసింది. బీఆర్ఎస్ సభ విజయంతో కంగుతిన్న నాటి సీఎం చంద్రబాబు ఆగమేఘాల మీద హెలికాప్టర్లో వెళ్లి దేవాదుల సాగునీటి ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. ఆ ఘటన కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమ తొలి విజయంగా నిలిచింది. 2002లో భూపాలపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ పవర్ ప్రాజెక్టుకు నాంది పలికింది. 2003లో వరంగల్లో జరిగిన తెలంగాణ జైత్రయాత్ర బహిరంగ సభ తెలంగాణ వాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అప్పటికే పదేండ్ల పాటు అధికారం కోల్పోయి, టీడీపీ పాలనలో చెల్లాచెదురైన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలను ఇచ్చింది. 2004 ఎన్నికల్లో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునేలా చేసింది. పొత్తు ఫలితంగా రాష్ట్రంలో, కేం ద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి జైత్రయాత్ర సభ దోహదం చేసింది. దీంతో పాటు కేంద్రంలో యూపీఏ -1 ప్రభుత్వ కామన్ మినిమం కార్యాచరణలో తెలంగాణను భాగం చేసింది. ఆ తర్వాత ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో ఉద్యమనేత కేసీఆర్ నినదించిన ‘బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు’ నినాదం ఇప్పటికీ కేంద్ర సర్కారు చెవిలో మారుమోగుతూనే ఉన్నది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను నాటి సీఎం వైఎస్ఆర్ కొనుగోలు చేసి తెలంగాణ వాదం లేదని నిరూపించేందుకు కుట్ర పన్నారు. ఆ కుట్రను తిప్పికొట్టేందుకు 2007లో వరంగల్లో కేసీఆర్ నిర్వహించిన ‘తెలంగాణ విశ్వరూప సభ’ చరిత్ర సృష్టించింది. సభ దిగ్విజయంతో తెలంగాణ వాదం అంటే అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు కాదని మరోసారి తేలిపోయింది.
చరిత్రను లిఖించిన ‘తెలంగాణ మహాగర్జన’
ప్రజలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటే ఉన్నారని ఈ సభ చాటిచెప్పింది. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ జైత్రయాత్రో.. కేసీఆర్ శవయాత్రో’ అని తెలంగాణ కోసం కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పింది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ‘ప్రకటిత రాష్ట్రం’గా చేసింది. కేసీఆర్ చేసిన 11 రోజుల ఆమరణ దీక్ష, తెలంగాణ ప్రజల మహోజ్వల పోరాటం, అమరుల త్యాగాల ఫలితంగా కేంద్రం దిగివచ్చింది. 2009 డిసెంబర్ 9న ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నాం’ అని నాటి హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. సమైక్యాంధ్ర పెట్టుబడి ఉద్యమంతో ఆ ప్రకటనపై కేంద్రం యూటర్న్ తీసుకున్నది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సత్తా ఏమిటో చూపాలని ప్రపంచంలోనే అత్యంత భారీ బహిరంగ సభను వరంగల్లో కేసీఆర్ నిర్వహించారు. 2010 డిసెంబర్ 16న (నిజానికి కేంద్రం తెలంగాణ ఇస్తామని ప్రకటించిన డిసెంబర్ 9నే ఈ సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. బహిరంగ సభ ముందు రోజు నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో డిసెంబర్ 16న నిర్వహించారు.) ‘తెలంగాణ మహాగర్జన’ సభ సరికొత్త చరిత్రను సృష్టించింది. 1930లో మహాత్మాగాంధీ చేపట్టిన దండి ఉప్పు సత్యాగ్రహం, అమెరికాలో మార్టిన్ లూథర్ పోరాటం.. ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద జన సమ్మేళనాల జాబితాలో తెలంగాణ మహాగర్జన చేరింది. ఈ విషయాన్ని న్యూయార్క్ పత్రిక ‘టైమ్స్’ ప్రత్యేక కథనంలో వెల్లడించింది.
పాలనను మలుపు తిప్పింది సభలే..
ఉద్యమ పార్టీగా ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన బీఆర్ఎస్ రాష్ట్ర సాధన అనంతరం ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నదని ఈ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ అనేక సభల ద్వారా నిరూపించారు. నాడు ఉద్యమంలో ముందుండి ప్రజలను నడిపించినట్టుగానే.. నేడు అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రజలను నడిపిస్తున్నారు. పార్టీకి కష్టమైనా, సుఖమైనా.. జయమైనా, అపజయమైనా అన్నీ ప్రజలేనని మొదటి నుంచి కేసీఆర్ అంటుంటారని ఆయనను దగ్గరి నుంచి చూసిన వాళ్లు చెబుతుంటారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను సభల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అభివృద్ధి, సంక్షేమంలో ప్రజలను మమేకం చేస్తున్నారు. 2017 ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించిన పార్టీ 16వ వార్షికోత్సవ సభ నుంచి నిన్న మొన్నటి దాకా జిల్లా సమీకృత కలెక్టరేట్లు, జిల్లా పోలీస్ కార్యాలయాలు, మెడికల్ కాలేజీలకు భూమి పూజా కార్యక్రమాల వరకు కేసీఆర్ బహిరంగ సభల ద్వారానే తెలంగాణ అభివృద్ధిని ప్రజల ముందుంచారు. తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకుంటూ వారి ఆశీస్సులతో నేటికీ అజేయంగా ముందుకు సాగుతున్నారు.
…? నూర