ఖమ్మం వ్యవసాయం, జనవరి 18 : ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో కళాకారుల ధూంధాం దద్దరిల్లింది. ప్రముఖ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆధ్వర్యంలో వందమంది కళాకారులు తమ ఆటాపాటల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచారు. ప్రధాన వేదిక కుడివైపున ఏర్పాటు చేసిన మరో భారీ వేదికపై మధ్యాహ్నం 12 గంటలకు సాయిచంద్ ఆధ్వర్యంలో ధూంధాం ప్రారంభమైంది. తొలుత తెలంగాణ, జాతీయ గీతాలాపనతో ఆటాపాట ప్రారంభమైంది. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు.. సీఎం కేసీఆర్ పోరాట పటిమను సాయిచంద్ పాటల ద్వారా అద్భుతంగా ప్రదర్శించారు. కళాకారుల పాటలకు అనుగుణంగా సభికులందరూ తాము కూర్చున్న చోటే నృత్యాలు చేశారు. భారత రాష్ట్ర సమితి ఏర్పాటు ఆవశ్యకత, కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సాయిచంద్ తన గళంతో ప్రజలకు అవగాహన కల్పించారు.