కోటా, ఆగస్టు 27: రాజస్థాన్లోని కోటాలో ఆందోళనకర స్థా యిలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతుండటంతో వాటి నివారణకు ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. ఇటీవలే హాస్టళ్లు, పీజీ గృహాలలో ఉన్న ఫ్యాన్లకు ప్రత్యేక స్ప్రింగ్ పరికరాల ఏర్పాటు తప్పనిసరి చేసిన అధికారులు ప్రస్తుతం ‘యాంటీ సూసైడ్ నెట్స్’ను హాస్టళ్లలోని బాల్కనీ, లాబీలలో ఏర్పాటు చేయిస్తున్నారు. విద్యార్థులు సాధారణంగా ఫ్యాన్కు ఉరేసుకోవడం, లేదా ఎత్తయిన ప్రదేశం నుండి దూకడం ద్వారా ప్రాణాలను తీసుకుంటారని, అందుకే వీటి నివారణకు స్ప్రింగ్ ఫ్యాన్లను విద్యార్థులుంటున్న అన్ని గదులలో ఇటీవల ఏర్పాటు చేసామని, ఇప్పుడు లాబీలు, బాల్కానీలలో పెద్ద వలలను ఏర్పాటు చేస్తున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. బలిష్టమైన వైర్తో ఉండే ఈ వలలు 150 కేజీల బరువు వరకు ఆపుతుందని, అందులో పడిన వారికి ఎలాంటి గాయాలు కావని ఆయన చెప్పారు. సాధారణంగా ఇలాంటి వలలు ముంబైలోని బహుళ అంతస్తుల భవనాలకు వాడతారన్నారు.