తాడూరు, ఆగస్టు 22 : ఎంజీకేఎల్ఐ కాలువ ద్వారా సరిపడా నీరు అందడం లేదని, దీంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాగునీటి పారుదల శాఖ కార్యాలయం ఎదుట తాడూరుతోపాటు మండలంలోని గుంతకోడూరు, వెంకటాపూర్ రైతులు ఆందోళనకు దిగారు. పురుగుల మందు డబ్బాలు పట్టకొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. డీ-26 కాలువలో సాగునీరు తక్కువగా పారుతుండటంతో పంటలకు సరిపోవడం లేదని వాపోయారు. డీ-26కు నీరు విడుదలయ్యే తూము వద్ద ఇసుక బస్తాలు, చెర్లటిక్యాల సమీపంలో కాలువలో సిమెంట్ పైపులు అడ్డుగా ఉండటంతో నీరు సరిగ్గా పారడం లేదని అన్నారు. ఈ విషయాన్ని ఏఈ భరణ్ దృష్టికి తీసుకెళ్లగా.. సాగునీటి సరఫరాకు ఆటంకాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.