బండ్లగూడ, మార్చి 10: తమ కాలనీలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ఆదివారం బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మశ్రీ కాలనీ వాసులు ప్లకార్డులను పట్టుకొని చేవెళ్ల రోడ్డుపై మౌన ప్రదర్శన చేశారు. కాలనీలో తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయిలో ఉందని జలమండలి మేనేజర్ శ్రీనివాస్తోపాటు జనరల్ మేనేజర్కు అనేక మార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమకు మంచినీళ్లు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కార్పొరేటర్ పద్మావతిపాపయ్యయాదవ్ మాట్లాడుతూ పద్మశ్రీ కాలనీలో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ను నిర్మించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. అయితే జనరల్ మేనేజర్ రవీందర్రెడ్డి బదిలీ కావడంతో రిజర్వాయర్ పనులు ప్రారంభోత్సవానికి నోచుకోలేదని చెప్పారు. జలమండలి అధికారులతో చర్చించి మంచినీళ్లు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.