కొండాపూర్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ( BRS MLAs) అక్రమ అరెస్ట్లను నిరసిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ హఫీజ్పేట్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన ( BRS Protest ) చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు అల్లావుద్దీన్ పటేల్ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు రంగారావు, నవతా రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలతో రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీ రాజ్యాన్ని నడుపుతోందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడాన్ని యావత్ తెలంగాణ సమాజం గమనిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ వైఫల్యాలను అసెంబ్లీ లో ఎండగడుతారని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే లను అడ్డుకొని అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలను సైతం తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసేలా చేయడం హేయనియమన్నారు. సామాన్య ప్రజల భూములను కావాలనే 22-ఎ జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మమత, పారునంది శ్రీకాంత్, సంగారెడ్డి కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.