BJP | హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ‘అధికారంలోకి వస్తాం.. రాష్ట్రంలో మేమే ప్రత్నామ్నాయం’ అంటూ బీరాలు పలికిన బీజేపీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. అసంతృప్తిని వెళ్లగక్కుతూ బీజేపీలోని ఒక్కో నేత అజ్ఞాతంలోకి జారుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ నిరసన ప్రకటిస్తుండగా చక్కదిద్దాల్సిన సీనియర్లు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు, కీలక సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే రఘునందన్రావు సైతం కొంతకాలంగా కామ్గా ఉంటున్నారు. బీజేపీకి ఊపు రావడానికి తన గెలుపే కారణమని, తనకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈటల రాజేందర్కు వై క్యాటగిరీ భద్రత కల్పించడంపై ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.
దున్నపోతును వెనుక నుంచి కాలితో తన్నుతూ వ్యాన్లోకి ఎక్కిస్తున్న ఒక వీడియోను పోస్ట్ చేయడం ద్వారా జితేందర్రెడ్డి ఏకంగా బీజేపీ పరిస్థితిని నగ్నంగా సోషల్ మీడియాలో నిలబెట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీని వీడేందుకు సిద్ధమైనట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ద్వారా ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్తో రాయబారాలు జరిగాయని.. చేరిక ఖాయమైందని చెప్పుకుంటున్నారు. తాజాగా అసంతృప్తుల జాబితాలో విజయశాంతి కూడా చేరిపోయారు. జిల్లాస్థాయిలో కూడా అనేకమంది నేతలు పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా హాజరవుతున్నారు.
తలపట్టుకుంటున్న జాతీయ నాయకత్వం
పార్టీలోని పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాల్సిన బండి సంజయ్ చేతులెత్తేశారని పార్టీ నేతలు భావిస్తున్నారు. అసంతృప్తి నేతలతో కనీసం సంప్రదింపులు కూడా జరపకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ సోషల్ మీడియాలో కమెడియన్గా మారిపోయారు. ఏదో ఒకటి తప్పుగా మాట్లాడటం, వింత చేష్టలు, నెటిజన్లకు దొరికిపోవడం పరిపాటిగా మారింది. దీంతో ఆయనను ఎద్దేవా చేస్తూ మీమ్లు, కామెంట్లు, పోస్టులతో సోషల్మీడియా హోరెత్తుతున్నది. కాంగ్రెస్ తరహా సంస్కృతికి తెరలేపిన రాష్ట్ర బీజేపీని ఎలా చక్కదిద్దాలో తెలియక ఢిల్లీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర పరిణామాలపై మోదీ నేతృత్వంలో సీనియర్ నేతలు ఇటీవల అర్ధరాత్రి దాకా చర్చలు జరిపారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.