హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): సాగునీటి రంగానికి విశేష ప్రాధాన్యమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మొదటి దఫాలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను పునరుద్ధరించింది. అనంతరం వాగుల పునరుజ్జీవంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ప్రతి వర్షపునీటి బొట్టును ఒడిసి పట్టాలనే సంకల్పంతో అన్ని వాగులపై కలిపి సుమారు రూ.3,825 కోట్ల నిధులతో 1,303 చెక్డ్యామ్లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం నాబార్డ్ సంస్థ రుణాన్ని అందిస్తున్నది. ఆ నిధులతో మొదటి విడతలో కృష్ణ, గోదావరి బేసిన్లో మొత్తంగా 625 చెక్డ్యామ్ల నిర్మాణాలను తొలిదఫా చేపట్టింది. అందుకు సంబంధించిన పనులు చకచకా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటివరకు రాష్టవ్యాప్తంగా 255 చెక్డ్యామ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 370 చెక్డ్యామ్ల పనులు తుది దశకు వచ్చాయని, వచ్చే నెలాఖరు నాటికి పూర్తికానున్నాయని అధికారులు తెలిపారు. రెండో దశలో రూ.1850 కోట్లతో 575 చెక్డ్యామ్ల నిర్మాణానికి సాగునీటిశాఖ అధికారులు ప్రభుత్వానికి ఇటీవలే ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
చెక్డ్యామ్ల నిర్మాణంపై సర్వత్రా హర్షం
ప్రభుత్వం రెండు విడతల్లో మొత్తంగా 1,200 చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టింది. ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో అదనంగా మరో 103 చెక్డ్యామ్లను నిర్మించింది. ఈ చెక్డ్యామ్ల నిర్మాణంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన చెక్డ్యామ్ల పరిధిలో భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతుండటంతో సాగు విస్తీర్ణం పెరిగి ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్డ్యామ్ల నీటినిల్వల్లో అక్కడి మత్స్యకారులు చేపలు పెంచుతూ ఉపాధి పొందుతున్నారు. భారీ ప్రాజెక్టుల్లో ఎక్కువ మొత్తంలో పూడిక చేరకుండా నిరోధించవచ్చని అధికారులు తెలుపుతున్నారు.