హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ప్రముఖ చిత్రకారుడు చంద్రశేఖర్ (చంద్ర) (74) కన్నుమూశారు. మూడేండ్ల్లుగా నరాల సంబంధ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఆయన ఇటీవల కరోనా బారినపడ్డారు. సికింద్రాబాద్లోని మదర్ థెరిస్సా రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పార్ధీవదేహానికి గురువారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. వరంగల్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ 1946 ఆగస్టు 28న జన్మించారు. కొన్నివేల తెలుగు పుస్తకాల కవర్ పేజీలు ఆయన చేతిలో రూపుదిద్దుకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.
రాజకీయ సామాజిక, వ్యంగ్య కార్టూన్లలో దిట్ట
చిత్రకారుడిగా, కార్టూనిస్ట్గా తనదైన ముద్రను వేసిన అరుదైన కళాకారుడు చంద్ర. వివిధ పత్రికల్లో కథలకు బొమ్మలు గీశారు. వేలాది నవలలు, పుస్తకాల కవర్ పేజీలకు అందమైన భావస్ఫూరకమైన చిత్రాలను వేశారు. తెలుగు లిపి రచనలో తనదైన శైలితో ఫాంట్స్ అందించిన సృజనశీలి చంద్ర. ఆయన కథలు కూడా రాశారు. రాజకీయ సామాజిక, వ్యంగ్య కార్టూన్లు వేశారు. ఎంతోమంది తెలుగు, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల రేఖాచిత్రాలు గీశారు. ప్రకృతి చిత్రాలతోపాటు జానపద, భక్తి ఆధ్యాత్మిక, విప్లవ, పౌరాణిక, ఆధునిక భావజాలాలకు చెందిన వేలాది బొమ్మలు గీశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రధాన చిత్రకారుడిగా పనిచేశారు. దాశరథి రంగాచార్య నవల చిల్లరదేవుళ్లు, మా భూమి సినిమాకు బొమ్మలు వేశారు. బీ నర్సింగ్రావు తీసిన రంగుల కల చిత్రంలో నటించారు. దాశరథి కృష్ణమాచార్య, పల్లా దుర్గయ్య, కాళోజీ నారాయణరావు, వేదకుమార్, గద్దర్, భూపాల్, శరత్, దర్శకుడు బీ నర్సింగ్రావుతోపాటు సీనియర్ నటులు లక్ష్మాగౌడ్, తోట వైకుంఠంకు అత్యంత సన్నిహిత మిత్రుడు చంద్ర.
సీఎం కేసీఆర్ సంతాపం
చిత్రకారుడు చంద్ర మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్సీ సురభీ వాణీదేవి సంతాపం ప్రకటించారు. గొప్ప చిత్రకారుడు చంద్ర మృతి ప్రజాకళారంగానికి తీరని లోటని టీఎన్జీవో పూర్వ అధ్యక్షుడు దేవీ ప్రసాదరావు పేర్కొన్నారు. చంద్రకు వినమ్రంగా నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.