హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రానికి అవసరమైన కూరగాయల సాగులో కీలకమైన విత్తనోత్పత్తిని రైతు స్థాయిలో చేస్తే నికర లాభాలు పెరుగుతాయని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ డీ రాజిరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ కూరగాయల పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని నర్సంపల్లి గ్రామ రైతులకు అఖిల భారత సమన్వయ పథకం కింద కూరగాయ సాగులో ఆధునిక పద్ధతులపై శిక్షణ కార్యక్రమాన్ని వీసీ ప్రారంభించారు. అనంతరం వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి మాట్లాడుతూ .. చిన్నపాటి మెళకువలు నేర్చుకుంటే దేశవాళీ(సూటి )రకాల్లో విత్తనోత్పత్తి రైతులే సొంతంగా చేసుకోవచ్చని తెలిపారు. వాటిని విశ్వవిద్యాలయమే తీసుకొని రైతులకు సరఫరా చేయనున్నదని పేర్కొన్నారు. దీంతో కూరగాయల విత్తనాల కొరత తగ్గుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రతి శని, ఆదివారాల్లో విద్యార్థులు నేరుగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులతో కలిసి పని చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కూరగాయల పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ డీ అనితాకుమారి, శాస్త్రవేత్త డాక్టర్ బీఎస్కే నిఖిల్ పాల్గొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపకశాఖ ద్వారా ప్రజలకు విస్తృతంగా అగ్నిమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నామని ఫైర్ డీజీ విక్రమ్సింగ్మాన్ తెలిపారు. మార్చి 6 నుంచి ఈ నెల 6 వరకు విద్యాసంస్థలు, దవాఖానల్లో మొత్తం 3,135 అవగాహన కార్యక్రమాల ద్వారా 2.44 లక్షల మంది విద్యార్థులు, దవాఖానల సిబ్బందికి అవగాహన కల్పించినట్టు మంగళవారం ప్రకటనలో వెల్లడించారు. ఈ కార్యక్రమాలను 99 రోజుల ప్రణాళిక ముగిసే వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాల్లో యువత, ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.