Telangana | వరంగల్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం ముందున్నదని ఇంగ్లండ్కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ డైలాన్ ఫిలిప్స్ ప్రశంసించారు. ఇంగ్లండ్ తరహాలోనే ఇక్కడా సాగు విధానం కనిపిస్తున్నదని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యవసాయం, ఆహారం, వైద్యం చాలా కీలకమని, ఈ రంగాల్లో బయో టెక్నాలజీ పాత్ర ఎక్కువగా ఉన్నదని తెలిపారు. ఒకప్పుడు వర్షాలు పడితేనే పంటలు పండేవని, ఇప్పుడు ఆధునిక పద్ధతులతో పంటలను సాగు చేస్తున్నామని చెప్పారు. రైతులు అధిక దిగుబడిని ఇచ్చే పంటలనే సాగు చేస్తారని, దీనికి అనుగుణంగా పరిశోధనల్లో మార్పులు రావాలని సూచించారు. ‘ప్లాంట్ బయో టెక్నాలజీ అండ్ జినోమ్ ఎడిటింగ్’ అంశంపై కాకతీయ వర్సిటీలో జరుగుతున్న సెమినార్లో పాల్గొనేందుకు వచ్చిన ఫిలిప్స్ ‘నమస్తే తెలంగాణ’తో తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..
బయో టెక్నాలజీతోనే..
వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. రైతులు ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్నారు. అధిక పోషక విలువలు కలిగిన పంటలు ఉత్పత్తి చేస్తున్నారు. బయో టెక్నాలజీతో ఎక్కువ దిగుబడినిచ్చే జన్యు పరివర్తిత వంగడాలను ఉత్పత్తి చేయవచ్చు. అధిక దిగుబడినిచ్చే, వ్యాధి నిరోధకత కలిగిన విత్తనాల అభివృద్ధికి, వ్యాక్సిన్ల తయారీకి, అధిక స్థాయిలో ఔషధాలు, రసాయనాలు, జీవ ఎరువులు, బయో పెస్టిసైడ్స్ ఉత్పత్తికి బయో టెక్నాలజీ ఉపయోగపడుతున్నది. మానవాళి మనుగడకు, సంక్షేమానికి అవసరమైన ఉత్పత్తులను తయారీకి సూక్ష్మజీవుల ధర్మాలను, వాటి వల్ల కలిగే ఉపయోగాలను, కణాలు, వాటిలోని భాగాలను పారిశ్రామిక స్థాయిలో బయోటెక్నాలజీ దోహదం చేస్తున్నది.
ప్రకృతి వైపరీత్యాలు..
ప్రకృతి విపత్తులతో విపరీతమైన నష్టం వాటిల్లుతున్నది. విపత్తులపై అవగాహన లేకపోవడం, ముందుగా అంచనా వేయలేకపోవడం, వాటిని ఎదుర్కొనే వ్యూహాలు లేకపోవడం వల్ల ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించడంలో జీవసాంకేతిక శాస్త్రం ప్రధాన పాత్ర పోషిస్తున్నది. బయోమైనింగ్, బయో రెమిడియేషన్ పద్ధతులతో పర్యావరణాన్ని మంచిగా మార్చవచ్చు. కాలుష్యాన్ని తగ్గించే సూక్ష్మజీవులను ఉత్పత్తి చేయవచ్చు. బయోగ్యాస్, వర్మికంపోస్ట్, బయో ఫెర్టిలైజర్స్ వంటి పర్యావరణహిత పద్ధతులను అభివృద్ధి చేయాలి. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ఇతర కాలుష్య కారకాల వల్ల భూమి కలుషితమవుతున్నది. పర్యావరణ పరిరక్షణ కోసం బయోటెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
జీనోమ్ ఎడిటింగ్..
జీనోమ్ ఎడిటింగ్ నియంత్రణకు జన్యుపరంగా మార్పు చెందిన జీవులను నియంత్రించేలా వివిధ దేశాల నివేదికలు సూచిస్తున్నాయి. జీనోమ్ ఎడిటింగ్ ప్లాంట్లు అంతర్లీన నియంత్రణ విధానాలను అనుసరిస్తున్నాయి. జన్యు సంకలనం నుంచి వచ్చిన మొక్కల నియంత్రణ కోసం పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉన్నది. బయోటెక్నాలజీ మొక్కల డీఎన్ఏని మార్చే సామర్థ్యాన్ని శాస్త్రవేత్తలకు అందించింది. నిర్దిష్ట స్థానాల్లో జన్యుపదార్థాన్ని జోడించడానికి, తీసివేయడానికి, మార్చడానికి అవకాశాలు ఉన్నాయి. బయో టెక్నాలజీతో ముందుముందు చాలా అద్భుతాలు జరగనున్నాయి.