హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీగా కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం విజ్జులతను నియమించారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం జీవో జారీచేశారు. ప్రొఫెసర్ విజ్జులత కోఠి మహిళా కళాశాల పూర్వ విద్యార్థి కావడం విశేషం. 1987-90 కాలంలో ఆమె ఇక్కడ బీఎస్సీ (బీజెడ్సీ) కోర్సు పూర్తిచేశారు. అధ్యాపక వృత్తిలో చేరి అంచెలంచెలుగా ఎదిగి తాను చదువుకున్న కాలేజీకి ప్రిన్సిపాల్గా, ఇప్పుడు వైస్ చాన్స్లర్గా నియమితులయ్యారు. కాగా, కోఠి ఉమె న్స్ కాలేజీని మహిళా వర్సిటీగా ఏర్పాటు చేయడమే కాకుండా, దీనికి ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో తొమ్మిది అంతస్థుల్లో భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
మంత్రి సబితను కలిసిన వీసీ విజ్జులత
మహిళా వర్సిటీ ఇన్చార్జి వీసీగా నియమితులైన ప్రొఫెసర్ ఎం విజ్జులత, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్యాదవ్ శనివారం హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. విజ్జులత నియామకం పట్ల హర్షం ప్రకటిస్తూ.. సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.