MLCs | హైదరాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ నియమితులయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాంతోపాటు సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు అమీర్ అలీఖాన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఆమోదం తెలిపారు. దీంతో వీరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా, గవర్నర్ తిరస్కరించారు. దీనిపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. ప్రొఫెసర్ కోదండరాం పూర్తి పేరు ముద్దసాని కోదండరాంరెడ్డి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం నెన్నెల్ గ్రామంలో వెంకటమ్మ, జనార్దన్రెడ్డి దంపతులకు 1955 సెప్టెంబర్ 5న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేసి రిటైరయ్యారు. పౌరహక్కుల ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన కోదండరాం తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీల పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ఏర్పాటైన టీజేఏసీకి కన్వీనర్గా వ్యవహరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ జనసమితి పేరుతో ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు.
ఇటీవల మృతి చెందిన సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడైన అమీర్ అలీఖాన్ 1973 అక్టోబర్ 18న హైదరాబాద్లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ పొందిన ఆయన 1994 నుంచి పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రముఖ ఉర్దూ పత్రిక సియాసత్ విస్తర్ణకు ఎంతగానో కృషి చేశారు. పాత్రికేయ వృత్తిలో భాగంగా పలు జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లను కవర్ చేశారు.