హైదరాబాద్, మే 3(నమస్తే తెలంగాణ): వారం రోజులుగా కురుస్తున్న వానలు శాస్త్రవేత్తల ముందు కొత్త సవాళ్లను ఉంచాయని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సుధీర్కుమార్ అన్నారు. పంటల సీజన్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ కూడా ప్రస్తావించిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఆ దిశగా దృష్టి సారించాలని కోరారు. బుధవారం వర్సిటీలో 2023-24 సీజన్కు సంబంధించి సాగు ప్రణాళికపై మూడు రోజుల సదస్సు ప్రారంభమైంది. తొలి రోజు అన్ని విభాగాల అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ సదస్సులో గతేడాది పనితీరును సమీక్షించుకొని, వచ్చే ఏడాదిలో అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు.
రాష్ట్రంలో కందులు, పత్తి విస్తీర్ణం మరింత పెరగడానికి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్ సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ తదితర నూతన టెక్నాలజీ అమలును విస్తృతం చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. యూనివర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్ వీ సుధారాణి గతేడాది ప్రగతిని నివేదించారు. నిత్యం రైతులకు అవసరమైన సేవల్ని అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీ యూట్యూబ్ చానల్లో ఇప్పటి వరకు 389 వీడియోలను అప్లోడ్ చేసి, పలు రకాల పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించినట్టు చెప్పారు. ఈ సదస్సులో వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.