కొల్లాపూర్, ఆగస్టు 30: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐ)లో భాగంగా మొదటి లిఫ్ట్ వద్ద సెప్టెంబర్ 3న ఒక మోటర్తో డ్రైరన్ నిర్వహించనున్నట్టు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్రావు తెలిపారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో పీఆర్ఎల్ఐలో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ మొదటి లిఫ్ట్ వద్ద నీటి పంపింగ్ కోసం ఏర్పాటు చేసిన 400/11కేవీ విద్యుత్తు సబ్స్టేషన్ను చార్జింగ్ సిస్టం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకర్రావు మాట్లాడుతూ.. మొదటి లిఫ్ట్లోని 400/11 కేవీ సబ్స్టేషన్కు ఏదుల రిజర్వాయర్ నుంచి విద్యుత్తును తీసుకొని వచ్చే నెల 3న ఒక మోటర్తో డ్రైరన్ నిర్వహిస్తామని చెప్పారు. 15న వెట్ రన్ కోసం నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారని వివరించారు.