నల్లగొండ: జిల్లాలోని చిట్యాల (Chityala) మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని పెద్దకాపర్తి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పేలిపోవడంతో మంటలు అంటుకున్నాయి. గమనించిన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులందరిని సురక్షితంగా కిందికి దించివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
మంటలు క్రమంగా బస్సు మొత్తం వ్యాపించడంతో కాలి బూడిదయింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.