హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్పై ప్రైవేటు పిటిషన్ దాఖలైంది. నారాయణపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కంభం శివకుమార్రెడ్డి తనపై వేధింపులకు పాల్పడి, చంపుతానని బెదిరించినప్పటికీ ఆయనపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ శ్రీలత అనే మహిళ గతంలో నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన కోర్టు.. సదరు కేసు తమ పరిధిలోకి రాదంటూ ఆ పిటిషన్ను తిరస్కరించింది. ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లాలని పిటిషనర్కు సూచించింది. ఈ నేపథ్యంలో శ్రీలత శుక్రవారం ప్రజాప్రతినిధుల కోర్టులో కొత్త పిటిషన్ దాఖలు చేసి, మీనాక్షీ నటరాజన్తోపాటు ఏడుగురిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్పై ప్రజాప్రతినిధుల కోర్టు త్వరలో విచారణ చేపట్టనున్నది.
నేడు గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష ; మీనాక్షి వ్యవహారంలో ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా..
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ రాజ్యసభకు వేసిన నామినేషన్ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. హైదరాబాద్లోని గాంధీభవన్లో శనివారం నిర్వహించే ఈ దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆలిండియా చైర్మన్ సునీల్ పన్వర్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొననున్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం చేపట్టే ఈ దీక్షలో ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలంగాణ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ చైర్మన్ రాచమల్ల సిద్ధేశ్వర్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు.