అబిడ్స్, జూలై 21 : రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలోని భాగ్యనగర్ ఎన్జీవోల స్థలాల్లో ప్రైవేట్ ఆక్రమణలను సహించేది లేదని, ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని భాగ్యనగర్ తెలంగాణ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ ఉద్యోగులకు స్థలాన్ని అప్పగించాలని బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ డిమాండ్ చేశారు. గోపనపల్లిలో ఆక్రమణలను నిరసిస్తూ ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారం ఆరో రోజుకు చేరాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యోగులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ.. బీటీఎన్జీవోకు చెందిన సుమారు 4 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు, సభ్యులకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టంచేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్రావు, కోశాధికారి ఏ శ్రీనివాస్, డైరెక్టర్లు ప్రభాకర్రెడ్డి, రజియాబేగం, కేశ్యానాయక్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.