Kolkata Doctor Murder హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): కోల్కతాలో వైద్యవిద్యార్థిని హత్యాచార ఘటనకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్లు వైద్యసేవలను నిలిపివేసి ‘స్టెత్ డౌన్’ నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద అన్ని వైద్యసంఘాలు కలిసి ధర్నా చేయాలని నిర్ణయించాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఒకరోజు ఓపీ సేవలు నిలిపివేయాలని ఐఎంఏ పిలుపునిచ్చింది. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 వరకు ఓపీకి దూరంగా ఉండాలని కోరింది. ఈ మేరకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఐఎంఏ పిలుపు మేరకు అనేక ప్రైవేట్ దవాఖానలు శనివారం ఓపీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. ఐఎం ఏ, జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సం ఘం (టీజీజీడీఏ) తెలిపింది. ప్రభుత్వ వైద్యులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తిచేసింది.
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేద రోగులకు ఇబ్బందు లు కలగకుండా ఉదయం 9 నుంచి 10 వర కు గంటపాటు ఓపీ సేవలు నిలిపివేయాలని పిలుపునిచ్చింది. జూనియర్ డాక్టర్లు సమ్మెలో ఉన్న కారణంగా అవసరమైతే గంట ఎకువగా పనిచేసి ఓపీ సేవలకు ఆటంకం కలుగకుండా చూడాలని కోరింది. కోల్కతా ఘటన వెనుక ఉన్న కుట్రకోణాన్ని వెలికితీసి, దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్డీఏ) డిమాండ్ చేసింది. శనివారం వైద్యసిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా వైద్యులు, వైద్యసిబ్బందికి పటిష్ఠమైన భద్రత కల్పించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు శనివారం జరిగే ధర్నాలో పాల్గొననున్నట్టు వెల్లడించింది. ధర్నాలో పాల్గొంటామని తెలంగాణ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఒకరోజు సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తెలిపింది. సీపీఐ కూడా మద్దతు పలికింది.
నర్సులపై దాడులకు నిరసన
కోల్కతాలో ఘటనతోపాటు రాష్ట్రంలోని షాద్నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నర్సింగ్ ఆఫీసర్పై దాడి, ఉత్తరాఖండ్లో ఓ నర్సుపై హత్యాచార ఘటనపై తెలంగాణ (ప్రభుత్వ) నర్సెస్ అసోసియేషన్ (టీఎన్ఏ) తీవ్రంగా స్పందించింది. శనివారం ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని కోరింది. పేద రోగులకు ఇబ్బందులు కలగకుండా 9 నుంచి గంటసేపు నిరసన ప్రదర్శన చేయాలని తెలిపింది.
వైద్యసిబ్బందికి భద్రత పెంచండి ;మంత్రి దామోదర రాజనర్సింహ
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బందికి భద్రత కల్పించాలని సంబంధిత ఉన్నతాధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ఆదేశించారు. కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కఠిన శిక్షపడేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో భద్రత అంశాలను పొందుపరిచిందని చెప్పారు.