గీసుగొండ/చెన్నారావుపేట, సెప్టెంబర్ 12 : కుట్టుమిషన్ పని నేర్చుకునే మహిళలకు కాకతీయ మెగా టెక్స్ పార్కులో ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కోనాయిమాకుల, మరియపురం, గంగదేవిపల్లి గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, సభ్యుల కుటీర పరిశ్రమలను పరిశీలించారు. అలాగే చెన్నారావుపేట మండలకేంద్రంలో పర్యటించారు.
ముందుగా కోనాయిమాకులలో భాగ్యలక్ష్మి స్వయం సహాయక సంఘం, ఝూన్సీ గ్రామైక్య సంఘం సభ్యులతో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొదుపు సంఘాల పనితీరు, గ్రామాక్య సంఘం విధులు, బ్యాంకు రుణాలు, స్త్రీనిధి రుణాలు, లింకేజీ రుణాల వివరాలను సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకుల నంచి తీసుకున్న రుణాలతో ఏర్పాటుచేసుకున్న కుటీర పరిశ్రమను ఆయన పరిశీలించారు.
ప్రతినెల సభ్యులంతా కలిసి పేదవారికి గుప్పెడు బియ్యం ప్రోగ్రాం ద్వారా పంపిణీ చేస్తామని సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా సుల్తానియా మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు పొదుపు చేయడంతో పాటు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. తడి, పొడి చెత్తను ఇంట్లోనే వేరు చేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ట్రాలీలో వేయాలని చెప్పారు. గ్రామ పరిశుభ్రతలో మహిళల పాత్ర ఎక్కువగా ఉండాలన్నారు. మహిళలు రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లించే విధానాన్ని ఆన్ చేసుకునేలా సభ్యులను తీర్చిదిద్దాలని సూచించారు. మహిళలు పొదపుతో పాటు ఆర్థికాభివృద్ధి సాధించేలా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
బ్యాంకులు సంఘాలకు లక్షల్లో రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుండడం ప్రభుత్వం సాధించిన విజయమన్నారు. పొదుపుతో పాటు పేదవారికి సహాయం చేయడం బాగుందని మహిళల గొప్ప మనస్సుకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు గ్రామాల్లో పనిచేయాలని మాటాలు కాదు పనులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, రాష్ట్ర ప్రాజెక్ట్ అధికారులు వైఎన్ రజిత, తదితరులు పాల్గొన్నారు.