ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి.. బురద చెప్పులోడిని చూసి వెక్కిరించాడట! మోదీ ప్రభుత్వం తీరుచూస్తే అలాగే ఉంది. నిండా అప్పుల్లో కూరుకుపోయిన కేంద్రం.. తెలంగాణపై బురదజల్లే తీరుతో నవ్వులపాలవుతున్నది.
తెలంగాణ అప్పులు జీఎస్డీపీలో కేవలం 2.74శాతం మాత్రమే. అంతెందుకు 2021-22లో అతితక్కువ రుణాలున్న పెద్ద రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందని సాక్షాత్తూ కేంద్రమే ప్రకటించింది. పైగా ఆ అప్పులు కూడా కాళేశ్వరం లాంటి ఆస్తుల కల్పనకే తెలంగాణ ప్రభుత్వం వెచ్చించింది.
అప్పుల మిత్తీలకే ప్రతిరోజూ రూ.2,500 కోట్లు చెల్లిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అప్పుల కుప్పలుగా మారిన బీజేపీ పాలిత రాష్ర్టాలను వదిలి తెలంగాణపై బట్టకాల్చిమీదేయడం విమర్శలపాలవుతున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): మీరు ఈ వార్తను మూడు నిమిషాల్లో చదవగలిగితే.. ఈ వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.10 కోట్ల అప్పు చేసి ఉంటుంది. అవును మీరు చదివింది నిజమే.. కేంద్రం ప్రతి క్షణానికి రూ.5.34 లక్షల అప్పు చేస్తున్నది. అంటే ఒక మధ్యతరగతి కుటుంబం ఏడాదిపాటు కష్టపడితే వచ్చే సంపాదనకు సమానమైన అప్పును కేంద్రం ఒక్క సెకనులో చేసేస్తున్నది. తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని పదేపదే గొంతు చించుకుంటున్న నేతలకు.. ఇది కనిపించడం లేదు. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు తెలంగాణ కంటే ఎక్కువగా లక్షల కోట్లు అప్పులు చేస్తూ, వడ్డీల కోసం కోట్లకు కోట్లు తగలేస్తున్నా వారికి కనిపించడం లేదు. పేరుకే ప్రతిపక్షమైనా పార్లమెంట్లో కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ నేతలకు లేకుండా పోయింది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్రెడ్డి పేరుకే ఎంపీ అయినా పార్లమెంట్లో ‘ఏమో సార్.. మాకు కనబడదు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడూ తెలంగాణపై పడి ఏడ్వడమే తప్ప.. ప్రజలు ఎంపీగా పంపినందుకు కేంద్రం విధానాలపై పోరాడుదామనే ధ్యాసే లేదు.
కేంద్రం అప్పుల్లో సగం మిత్తీలకే
‘పూటగడవడానికి డబ్బులేక.. చేసే ప్రతి రూపాయి అప్పులో.. ఆఠాణా మిత్తీలే కట్టడానికి సరిపోతే..’ అద్భుత పురోగతి సాధించినట్టా? పతనం అంచున నిలబడ్డట్టా?. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఇలాగే ఉన్నది. ప్రధాని మోదీ హయాంలో దేశాన్ని అప్పుల కుప్పగా మార్చడమే కాదు.. వడ్డీలను సైతం తలకుమించిన భారంగా తయారుచేశారు. 2021-22 లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆ ఏడాది చేసిన అప్పు రూ.14,86,618 కోట్లు. ఇక రోజువారీగా గణిస్తే ప్రతి రోజూ రూ.4,073 కోట్లు అప్పు చేసింది. ఇక ఆ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.8,05,499 కోట్లు మిత్తీ కట్టింది. అంటే.. రోజుకు రూ.2,207 కోట్లు వడ్డీ చెల్లించింది. ఈ లెక్కన ఆ ఏడాది కేంద్రం చేసిన అప్పుల్లో సగానికిపైగా సుమారు 55 శాతం వడ్డీలకే పోయింది. అంటే.. రూపాయి అప్పు తెస్తే.. 55 పైసలు వడ్డీ కట్టడానికే సరిపోయిందన్నమాట.
తాజాగా సమర్పించిన బడ్జెట్లో ఈ ఏడాది రూ.16.85 లక్షల కోట్ల అప్పు చేస్తామని కేంద్రం తెలిపింది. దీంతో మోదీ హయాంలో పదేండ్లలో చేసిన అప్పు రూ.112 లక్షల కోట్లకు చేరనున్నది. ఈ మొత్తానికి కేంద్రం గ్యారంటీలు రూ.5,19,399 కోట్లు అదనం. పదేండ్లలో జీడీపీ విలువ 140 శాతం పెరిగితే.. అప్పులు మాత్రం 170 శాతానికిపైగా పెరిగాయి. అంటే.. కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే మార్గాల కన్నా.. అప్పులపైనే ఎక్కువగా దృష్టిపెట్టిందని స్పష్టం అవుతున్నది.
అప్పుల్లో ‘బీజేపీ, కాంగ్రెస్’ రాష్ర్టాలే టాప్
మోదీ అసమర్థ ఆర్థిక విధానాల చలవతో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం వైపు ప్రయాణిస్తున్నా.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు ఎడాపెడా అప్పులు చేసి అటు అభివృద్ధి చేయలేక, ఇటు వడ్డీల భారం మోయలేక దినదిన గండంగా పాలన కొనసాగిస్తున్నా.. రాష్ట్ర ప్రతిపక్ష నేతలకు కనీసం పట్టడం లేదు. తెలంగాణను మాత్రం ఆడిపోసుకుంటున్నారు. రాష్ట్రం తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని పొగడాల్సింది పోయి.. ఇతర రాష్ర్టాల ముందు పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు.
మోదీ పాలనలోని మొదటి సంవత్సరం 2014-15లో రూ.5.73 లక్షల కోట్ల అప్పు చేస్తే.. 2021-22 నాటికి ఏటా చేసే అప్పు మూడు రెట్లు పెరిగింది. నాడు ఏటా రూ.4.02 లక్షల కోట్ల వడ్డీలు కడితే.. 2021-22 నాటికి వడ్డీ భారం రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది ఏకంగా రూ.10 లక్షల కోట్లు మిత్తీ కట్టనున్నట్టు కేంద్రం పేర్కొన్నది.
తెలంగాణ ఆచితూచి అప్పు.. అయినా చూడలేం
తెలంగాణ ఏర్పడినప్పుడు 2014-15లో రాష్ట్రం అప్పు రూ.72,658 కోట్లు. 2021-22 నాటికి అది రూ.3,14,135 కోట్లకు చేరింది. అంటే, ఎనిమిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు రూ.2,41,477 కోట్లు. కొత్త రాష్ట్రం.. అన్ని రంగాల్లో కునారిల్లింది.. ఆశించిన స్థాయిలో లేని సొంత ఆదాయం, ఆర్థిక వనరులు.. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తూ ముందుకు వెళ్లింది. అప్పుగా తెచ్చిన ప్రతి రూపాయిని పెట్టుబడి వ్యయంగా మార్చి.. అనేక నిర్మాణాలు, కార్యక్రమాలు చేపట్టింది. ఫలితంగా తెలంగాణ రూపురేఖలే మారిపోయాయి. ప్రజల ఆదాయం రెట్టింపయ్యింది. రాష్ట్ర జీఎస్డీపీ రెండున్నర రెట్లు పెరిగింది. దేశంలోని అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఇదే సమయంలో దశాబ్దాల చరిత్ర కలిగి, ఆర్థికంగా బలంగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు ఎనిమిదేండ్లలో తెలంగాణ కన్నా ఎక్కువగా అప్పులు చేశాయి. అయినా.. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కండ్లు కనిపించడం లేదు.
మిత్తీల చెల్లింపుల్లోనూ ‘డబుల్’
ఏటా వడ్డీల చెల్లింపుల పరంగా చూసినా తెలంగాణ ఇతర రాష్ర్టాల కన్నా మెరుగ్గా నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం వడ్డీ చెల్లింపులు రూ.17,584 కోట్లుగా ఉన్నాయి. అనేక బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ ఎంతో మెరుగ్గా ఉన్నది. దేశంలో అత్యధికంగా మిత్తీలు చెల్లిస్తున్న రెండు రాష్ర్టాలు బీజేపీవే కావడం గమనార్హం. యూపీ, మహారాష్ట్ర ఏటా రూ.43 వేల కోట్ల చొప్పున వడ్డీ కడుతున్నాయి. తెలంగాణ కన్నా రెండున్నర రెట్లకుపైగా ఎక్కువ. అన్ని రాష్ర్టాలు కలిపి కడుతున్న మిత్తీల్లో దాదాపు పావు వంతు ఈ రెండు రాష్ర్టాలవే కావడం వాటి దుస్థితికి నిదర్శనం. ఇక మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ సైతం తెలంగాణ కన్నా ఎక్కువగా మిత్తీలు కడుతున్నది. 2021-22లో ఏకంగా రూ.27 వేల కోట్ల వడ్డీ కట్టింది. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ రూ. 28,360 కోట్ల మిత్తీ కట్టగా.. నాడు కాంగ్రెస్ పాలనలో ఉన్న పంజాబ్ రూ.20,316 కోట్లు చెల్లించింది.