హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): దేశంలో భవన నిర్మాణ సామగ్రి ధరలు మండిపోతున్నాయి. నిరుడు రూ.40-45 వేలుగా ఉన్న టన్ను స్టీల్ ధర.. ఇప్పుడు రూ.85 వేలకు చేరింది. అల్యూమినియం ధర సైతం 40-45% పెరిగింది. వీటితోపాటు సిమెంట్, ఇతర సామగ్రి ధరలు కూడా భారీగా పెరగడంపై రియల్ ఎస్టేట్ బిల్డర్లు, డెవలపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్న ఈ ధరలను భరించలేమని స్పష్టం చేస్తున్నారు. వీటిని నియంత్రించకుండా చోద్యం చూస్తున్న కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. దీన్ని నిరసిస్తూ ఈ నెల 4న నిర్మాణ పనులను నిలిపివేయనున్నట్టు ప్రకటించారు. ఈ అంశంపై శుక్రవారం హైదరాబాద్లో క్రెడాయ్ హైదరాబాద్, ట్రెడా, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ సంయుక్త సమావేశాన్ని నిర్వహించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ ఉత్పత్తిదారులు యథేచ్ఛగా భవన నిర్మాణ సామగ్రి ధరలను పెంచేస్తున్నారని, ఫలితంగా నిర్మాణ ప్రాజెక్టుల వ్యయాలు భారీగా పెరుగుతున్నాయని ఆయా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. దీని వల్ల గృహాల ధరలు సైతం అదే స్థాయిలో పెరిగి కొనుగోలుదారులకు భారంగా పరిణమిస్తుందని వివరించారు.
భవన నిర్మాణ సామాగ్రి ధరల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. ప్రస్తుతం నిర్మాణ రంగంలో తీవ్రమైన పోటీ నెలకొనడంతో డెవలపర్లు అతి తక్కువ మార్జిన్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇన్పుట్ వ్యయం పెరగడం వల్ల ఆ కొద్దిపాటి లాభం కూడా రావడంలేదు. దీంతో నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టలేకపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన లక్షల మంది ఉపాధి కోల్పోతారు. దీన్ని అడ్డుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి.
– జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
దేశంలో రెండవ అతిపెద్ద ఉపాధి కల్పనదారుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం.. జీడీపీకి సైతం అదే స్థాయిలో వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ప్రస్తుతం ఈ రంగంలో నెలకొన్న అనిశ్చితి మూలంగా ఇప్పటికే పలువురు బిల్డర్లు తమ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేశారు. ముడి సామగ్రి ధరలు తగ్గే వరకు ఆయా ప్రాజెక్టులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడంలేదు. దీంతో ఈ రంగంపై ఆధారపడిన లక్షల మంది జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉన్నది.
– సీహెచ్ రామంచంద్రారెడ్డి, కెడ్రాయ్ తెలంగాణ చైర్మన్
గతేడాదితో పోలిస్తే ఇప్పుడు స్టీల్, అల్యూమినియం ధరలు రెట్టింపయ్యాయి. సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు కూడా అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. లేకపోతే రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడం ఖాయం. ఇండ్ల ధరలను పెంచడం తప్ప డెవలపర్లకు మరో మార్గమేమీ ఉండదు. ఫలితంగా కొనుగోలుదారులపై భారం పడుతుంది.
– వీ రాజశేఖర్రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి