హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఒక కుటుంబాన్ని నడిపే ఇంటి పెద్ద కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చటంలో ఎంతో జాగ్రత్త వహిస్తాడు. ఏవైనా నిత్యావసరాల ధరలు పెరిగేట్టున్నా, కొరత ఏర్పడే ప్రమాదమున్నా వెంటనే అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకొంటాడు.
నలుగురైదుగురు ఉండే కుటుంబం విషయంలోనే ఇలా ఉంటే! 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని పాలిస్తున్నవారు ఎంత అప్రమత్తంగా ఉండాలి? కానీ, కేంద్రంలోని మోదీ సర్కారు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను అంచనా వేసి, జాగ్రత్త వహించటంలో ఘోరంగా విఫలమైంది. రూపాయి అంతకంతకూ బక్కచిక్కి పోతున్నది.. దాంతోపాటే సామాన్యుడి బతుకూ చిక్కి శల్యమవుతున్నది.
బియ్యం, వంటనూనె, ఉప్పు, పప్పు వంటి ఆహార పదార్థాలతోపాటు వంటగ్యాస్, పెట్రోల్.. వంటి ఇంధనాల ధరలు భగ్గున మండుతూ సగటు భారతీయుడి జీవితాన్ని మసి చేస్తున్నాయి. ఒకనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోతున్నదని నిగ్గదీసిన నేటి ప్రధాని నరేంద్రమోదీ.. ఇప్పుడు అథఃపాతాళానికి పడిపోయిన రూపాయిని పైకి లేపలేక ఆపసోపాలు పడుతున్నారు.
ఒకవైపు వర్షాభావం ఆహార ధాన్యాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపితే, బీజేపీ సర్కారు అనాలోచిత నిర్ణయాలతో కోట్ల మంది రైతులు భూములను పడావు పెట్టాల్సి వచ్చింది. ఇంకోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో కరువు పరిస్థితులు.. ఇలా ముప్పేట ముసురుకొంటున్న ప్రమాదాలను గుర్తించటంలో కేంద్రానికి ముందుచూపు కొరవడింది.
దీంతో ఇప్పుడు దేశంలోని ప్రతి సామాన్యుడి మెడకు ధరల పెరుగుదల ఉచ్చులా చుట్టుకొన్నది. ధరల పెరుగుదల మరింత తీవ్రమై ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం తీరుతో సామాన్యుడు మూడుపూటలా తిండి తినటానికి కూడా నోచుకోలేని పరిస్థితి తీసుకొచ్చిందని లోకల్ సర్కిల్స్ సర్వే ఇటీవల తేల్చింది.
ఏం కొనేటట్టు లేదు
రూపాయి విలువ పతనంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పప్పుల నుంచి నూనెల వరకు ప్రతీదీ కొండెక్కి కూర్చున్నది. దీంతో కుటుంబ బడ్జెట్ కుంచించుకుపోయి సాధారణ అవసరాలను సైతం తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఎనిమిది సంవత్సరాల్లో నిత్యావసర వస్తువుల ధరలు సుమారు 300 శాతం పెరిగినట్టు లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది.
కొంపముంచిన కేంద్రం
ఇంధన ధరల పెరుగుదల సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా చార్జీలు 30 శాతం పెరిగినట్టు వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. దీంతో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయని అంటున్నారు.
నిర్మాణ రంగంలోనూ ధరల పెరుగుదల ఎన్నడూలేని విధంగా నమోదైంది. స్టీలు ధరల్లో ఏకంగా 50 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. గతంలో 25-30 వేల వరకు ఉండే టన్ను స్టీలు, రూ.85 వేల వరకు వెళ్లింది. బస్తా సిమెంట ధర గతంలో రూ.250-280 మధ్య ఉంటే ఇప్పుడు రూ.305-350 మధ్య ఉన్నది. దీంతో ఇండ్ల నిర్మాణ వ్యయం 25-30 శాతం మేర పెరిగింది.
నిత్యావసరాల ధరల పెరుగుదలతో తల్లడిల్లుతున్న సామాన్యుడిని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం, పిల్లలు తాగే పాల నుంచి అంత్యక్రియలపైనా జీఎస్టీ విధించి అగ్గికి ఆజ్యం పోసింది. వ్యవసాయరంగంపై కేంద్రానికి ఒక విధానమమంటూ లేకపోవటంతో 140 కోట్ల మంది ఆహార భద్రత ప్రమాదంలో పడింది. గోధుమలు, బియ్యం ఎగుమతుల విషయంలో తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలు గందరగోళానికి దారి తీశాయి.
రూపాయి పతన ప్రభావం
సామాన్య వినియోగదారులు: ఈ వర్గాలు ఇప్పటికే రూపాయి పతనం తాలూకు దారుణ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. దిగుమతి చేసుకొనే అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి.
విదేశాల్లో చదివే విద్యార్థులు: ఒక డాలర్ కొనాలంటే ఇప్పుడు దాదాపు రూ.83 చెల్లించాల్సి వస్తుండటంతో విదేశాల్లో చదివే మన విద్యార్థులు కొండంత భారాన్ని మోయాల్సి వస్తున్నది.
పర్యాటకులు: విదేశాల్లో పర్యటించాలనుకొనేవారు గతంలో వేసుకొన్న బడ్జెట్ కంటే ఇప్పుడు దాదాపు 30శాతం అధికంగా ఖర్చుపెట్టాల్సి వస్తున్నది. చాలా దేశాల కరెన్సీ కూడా కుంగినప్పటికీ విమాన టికెట్లు, హోటల్ చార్జీలు డాలర్ల రూపంలోనే చెల్లించే పరిస్థితి ఉండటంతో భారం తప్పటం లేదు.
ప్రజలకు కేంద్రం నూకలే తినిపిస్తది
దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం, ఆహార ధాన్యాల ఉత్పత్తి మొదలు దిగుమతుల వరకు నెలకొన్న గందరగోళానికి కేంద్ర ప్రభుత్వ విధాన వైఫల్యమే కారణం. క్షీణిస్తున్న రూపాయి విలువతో మన కొనుగోలు శక్తి కూడా పడిపోతున్నది. దిగుమతులు ఖరీదైనవిగా మారి.. దాని ప్రభావం ధరల పెరుగుదల రూపంలో సామాన్యుడిపై పడుతున్నది. మున్ముందు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. ఆహార ధాన్యాల నిల్వలు కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో కేంద్రం మనందరికీ నూకలే తినే పరిస్థితి తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
– డీ పాపారావు, ఆర్థికవేత్త
ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి
దేశంలో ఉన్నవారికి, లేనివారికి మధ్య అంతరం విపరీతంగా పెరుగుతున్నది. రెండువర్గాల వారి ఆదాయం పెరుగుతున్నట్టు కనిపించినా.. వాటి మధ్య తేడా చాలా ఉన్నది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సామాన్యుడి కొనుగోలు శక్తి ఉండటం లేదు. వాస్తవానికి మన దేశంలో ఆహార నిల్వలు బాగానే ఉంటాయి. మనకు 60 లక్షల టన్నుల ఆహార నిల్వలు కావాల్సి ఉంటే… ఇప్పుడు 120 లక్షల టన్నుల వరకు ఉన్నాయి. కానీ, బియ్యం ధర ఎందుకు పెరుగుతున్నదనేది కీలక ప్రశ్న. సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణం.
– ప్రొఫెసర్ ఎం రాములు, ఉస్మానియా యూనివర్సిటీ