హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ఏపీలోని శ్రీకాళహస్తి ఫిన్కేర్ బ్యాంక్ చోరీ కేసులో భారీ ట్విస్ట్ చోటుచేసుకొన్నది. దోపిడీ జరిగిందంటూ ఫిర్యాదు ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ స్రవంతినే అసలు దొంగగా పోలీసులు నిర్ధారించారు. పోలీసుల కథనం ప్రకారం.. స్రవంతి.. బ్యాంకులో గిల్టు నగలు తాకట్టు పెట్టి డబ్బు కాజేసింది. ఆడిట్లో బయటపడుతుందనే ఉద్దేశంతో దొంగతనం డ్రామా ఆడింది.
చెన్నైకి చెందిన ముగ్గురు యువకులతో బ్యాంకు దోపిడీకి ప్లాన్ వేసింది. స్రవంతి ప్లాన్ ప్రకారం ఆ దుండగులు బ్యాంక్ లాకర్ నుంచి 67 ప్యాకెట్లలో దాదాపు రెండు కేజీల బంగారం, కొంత నగదు ఎత్తుకెళ్లారు. ఆ తరువాత తన చేతులు కట్టేసి అరవకుండా నోటిలో గుడ్డకుక్కి బెదిరించి చోరీ చేశారని స్రవంతి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నంలో ముందునుంచీ అనుమానాస్పదంగా వ్యవహరించి అడ్డంగా దొరికిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు స్రవంతి బ్యాంక్కు కన్నం వేసినట్లు పోలీసులు తెలిపారు.