హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయినా ఇంకా చారిత్రక, వారసత్వ సంపద, కళాఖండాల విభజన అసంపూర్తిగా జరిగిందని, తక్షణమే ఆయా కళాఖండాలను ఇరు రాష్ర్టాలు సామరస్యపూర్వకంగా విభజించుకోవాలని ఆబ్కారీ, పురావస్తు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఏపీ యువజన సర్వీసులు, పురావస్తు శాఖల ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ శనివారం హైదరాబాద్లో మంత్రి శ్రీనివాస్గౌడ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య పురావస్తు శాఖకు చెందిన సంపద, చారిత్రక, వారసత్వ, కళాఖండాల విభజనపై చర్చించారు. అనంతరం శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణకు చెందిన కొన్ని అద్భుత కళాఖండాలు ఏపీలోని పలు మ్యూజియంలలో, అక్కడి కళాఖండాలు తెలంగాణ మ్యూజియంలలో ఉన్నాయని తెలిపారు. ఇరురాష్ట్రాల మధ్య స్నేహపూర్వకంగా విభజన జరగాలని ఆకాంక్షించారు. దీనికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని పురావస్తు శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాను మంత్రి ఫోన్లో ఆదేశించారు.
‘గీతవృత్తిలో మరణాల నివారణ’ పుస్తకావిష్కరణ
గౌడ్ ఐక్యసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ రచించిన ‘గీత వృత్తిలో మరణాల నివారణ’ అనే పుస్తకాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ నేతలు, వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు పల్లె రవి, నాగేందర్గౌడ్, అమరవేణి నర్సగౌడ్, వంగ సదానందం గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్గౌడ్, బత్తిని లతాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.