హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆద్యకళ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ (ఐజీఎన్సీఏ)బాధ్యులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం తేనీటి విందు ఇచ్చారు. గత జూలైలో రాష్ట్రపతి భవన్లో ‘జనజాతి దర్పణ్’ పేరుతో ఆదివాసీల కళాఖండాల మ్యూజియం ఏర్పాటైంది. ఈ మ్యూజియాన్ని ఢిల్లీలోని ఐజీఎన్సీఏ సంస్థ, హైదరాబాద్కు చెందిన ‘ఆద్యకళ మ్యూజియం’ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.
170కిపైగా ఆదివాసీ కళాఖండాలు సేకరించి ఈ మ్యూజియంలో కొలువు ఉంచగా.. పలువురు మేధావులు, ప్రజల అభిమానాన్ని చూరగొన్నది. దీంతో ఈ రెండు సంస్థల బాధ్యులను అభినందించిన రాష్ట్రపతి ముర్ము తేనీటి విందు ఇచ్చారు. అనంతరం వారితో కలిసి ఫొటో దిగారు. రాబోయే రోజుల్లో ఈ రెండు సంస్థల సహకారం కావాలని రాష్ట్రపతి భవన్ అధికారులు కోరారు. కార్యక్రమంలో ఐజీఎన్సీఏ మెంబర్, సెక్రటరీ డాక్టర్ సచ్చిదానంద్ జోషి, జానపద శాఖ అధిపతి ప్రొఫెసర్ కే అనిల్కుమార్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు పాల్గొన్నారు.