హైదరాబాద్, ఫిబ్రవరి 13 : సమానత్వం ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని, సామాజిక అసమానతలను రూపుమాపడానికి వెయ్యేండ్ల కిందటే రామానుజాచార్యులు విశేష కృషిచేశారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ప్రజల్లో భక్తి, సమానతను చాటడానికి రామానుజుడు భక్తిమార్గాన్ని ఎంచుకొన్నారని చెప్పారు. భక్తి ద్వారా ముక్తిని ప్రబోధించి, విశ్వవ్యాప్తం చేసిన గొప్ప తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త అని కొనియాడారు. రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని సమతాస్ఫూర్తి కేంద్రాన్ని ఆదివారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సతీసమేతంగా సందర్శించారు. కేంద్రం మొదటి అంతస్థులో ప్రతిష్ఠించిన రామానుజుడి స్వర్ణమూర్తిని రాష్ట్రపతి లోకార్పణం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈశ్వరారాధన అన్నివర్గాల హక్కు అని రామానుజుడు బోధించారని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ జన్మభూమి, సమతామూర్తి రామానుజాచార్యులు వెలిసిన శ్రీరామనగరం అత్యంత పవిత్రమైనవిగా భావిస్తానని అన్నారు. రామానుజుడి సమతా ఆదర్శాలను అంబేద్కర్ కూడా అమితంగా గౌరవించారని రాష్ట్రపతి గుర్తుచేశారు.
సమానత్వ భావనలు పాశ్చాత్య దేశాల నుంచి ఉద్భవించినవి కావని, భారతదేశ గడ్డపై ఉద్భవించినవేనని వివరించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, వివక్షకు తావులేదని, అవకాశాలలో సమానత్వం, అంటరానితనం నిర్మూలన తదితర ప్రాథమిక హక్కులన్నీ రాజ్యాంగంలో పొందుపరిచారని వెల్లడించారు. గాంధీ, అంబేద్కర్ల ఉద్యమస్ఫూర్తి, ఆశయాలు, లక్ష్యాలు యువతరానికి విదితమేనని చెప్పారు. చినజీయర్ స్వామి మాట్లాడుతూ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హయాంలో దేశగౌరవం ఇనుమడించిందని కొనియాడారు. సమతామూర్తి ప్రతిమను రాష్ట్రపతికి బహూకరించారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, రామానుజుల ట్రస్టు ప్రతినిధులు జూపల్లి రామేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి రాజ్భవన్కు చేరుకొని అక్కడే బస చేశారు.