హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): బీటీపీఎస్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు బీహెచ్ఈఎల్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ అనే విషయం సంజయ్కి తెలుసా? అని ప్రశ్నించారు. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే ఆలస్యం అవుతుందన్న కారణంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్కు అప్పగించారని స్పష్టంచేశారు.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బీహెచ్ఈఎల్ సంస్థ అవినీతి ఎలా చేసిందో ఆధారాలతో బయటపెడితే బాగుండేదని బండి సంజయ్కు చురకలేశారు. రాష్ట్రంలోని విద్యుత్తు వెలుగులను చూసి జీర్ణించుకోలేక సంజయ్ అలా మాట్లాడారని ఎద్దేవాచేశారు. దేశమంతా విద్యుత్తు కోతలతో అల్లాడిపోతుంటే.. తెలంగాణలో నాణ్యమైన 24 గంటల విద్యుత్తు సరఫరా అవుతున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 శాతం విదేశీ బొగ్గును కొనుగోలు చేస్తే టీఎస్ జెన్కోపై ఏటా రూ.3,500 కోట్ల భారం పడుతుందని, విద్యుత్తు చార్జీలు పెంచాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందుకే.. విదేశీ బొగ్గును కొనే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.
పవర్ ఇంజనీర్స్పై బండి సంజయ్ ఆరోపణలు విద్యుత్తు ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రతి నిర్ణయాన్ని పవర్ ఇంజనీర్స్ తప్పుబడతారని స్పష్టంచేశారు. విద్యుత్తు కొనుగోలు, విదేశీ బొగ్గు దిగుమతి నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తున్నందునే బండి సంజయ్ తప్పుడు వ్యాఖ్య లు చేస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్తు కొనుగోలు, విదేశీ బొగ్గు దిగుమతిపై సంజయ్కి కనీస అవగాహన లేదని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.