ఇచ్చోడ, మార్చి 4 : కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) సర్పంచ్ గాడ్గే మీనాక్షి.. కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేతుల మీదుగా స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పథకాల వల్లే ఈ వార్డు వచ్చిందని అన్నారు. పల్లె ప్రగతి గ్రామ స్వరూపాన్నే మార్చిందని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముక్రా(కే) గ్రామం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. ముక్రా(కే) గ్రామం అన్ని విభాగాల్లో అగ్రగామిగా నిలవడానికి అవసరమైన సహాయ సహకారాలు, నిధులు, మార్గ దర్శకాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.